కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు

CC Cameras In Covid Hospitals - Sakshi

తొలుత 108 ఆస్పత్రుల్లో.. ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో ఏర్పాటు

వైద్య శాఖ ఉన్నతాధికారులు,కలెక్టర్లకు సీసీ కెమెరా లింకులు

ఎప్పటికప్పుడు కోవిడ్‌ బాధితులకు చికిత్సపై నేరుగా పర్యవేక్షణ

చికిత్స విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై తక్షణమే చర్యలు

సాక్షి, అమరావతి: ఇప్పటికే 104 కాల్‌సెంటర్‌ ద్వారా కోవిడ్‌ బాధితులకు సత్వర సేవలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. బాధితులకు అందుతున్న సేవలను నేరుగా పర్యవేక్షించడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను అమర్చనుంది.

► రెండు రోజుల్లో ముందుగా 108 ఆస్పత్రుల్లో 2 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం దాదాపు రూ.3 కోట్లు ఖర్చు పెడుతోంది.
► ఆ తర్వాత మరో 35 ఆస్పత్రుల్లో కూడా సీసీ కెమెరాలు అమరుస్తారు.
► బాధితుల బంధువులు సమాచార లోపంతో ఇబ్బందులు పడకుండా వీటి ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు చికిత్సపై వాకబు చేస్తారు. 

సీసీ కెమెరాల ద్వారా పక్కాగా పర్యవేక్షణ
► ఐసీయూ, నాన్‌ ఐసీయూ, జనరల్‌ వార్డులన్నింటిలో సీసీ కెమెరాలు. నేరుగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పర్యవేక్షించడానికి వీలుగా వారికి సీసీ కెమెరా లింకులు.
► కోవిడ్‌ బాధితులకు సకాలంలో చికిత్స అందుతోందా? మందులు ఇస్తున్నారా? భోజనం పెడుతున్నారా? ఆక్సిజన్, వెంటిలేటర్‌ పడకల సౌలభ్యం వంటివన్నీ పర్యవేక్షించే వీలు.
► ఎక్కడైనా రోగులు అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బంది పడుతున్నట్టు అనుమానమొస్తే తక్షణమే ఆ ఆస్పత్రి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు.
► డ్యూటీలో ఉన్న వైద్యులే చికిత్సకు బాధ్యులు
► రోగుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినా తక్షణమే చర్యలు 
► ప్రతి ఆస్పత్రికి సంబంధించిన అధికారి మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను డిస్‌ప్లే బోర్డులో ఉంచుతారు.
► ఎవరైనా అధికారులు, వైద్యులు సకాలంలో స్పందించకపోతే 104కు కాల్‌ చేసి 2 నొక్కితే పూర్తి వివరాలు బాధితుడి సహాయకులు లేదా బంధువులకు అందిస్తారు.
► సీసీ కెమెరాలతో ఏ ఆస్పత్రిలో ఏం జరుగుతోందో నేరుగా తెలుసుకుని బాధితులకు సత్వర న్యాయం అందిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top