
నెల్లూరు, సాక్షి: కారు బీభత్సంతో బుధవారం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా తెలుస్తోంది.
పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. ఈ దుర్ఘటనలో షాప్లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడు.
బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


