కారు బీభత్సం | Car accident near Ongole Southern Bypass | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం

Jun 17 2026 5:35 AM | Updated on Jun 17 2026 5:35 AM

Car accident near Ongole Southern Bypass

ఇద్దరు మహిళల దుర్మరణం 

ఒంగోలు దక్షిణ బైపాస్‌ సమీపంలో ఘటన

ఒంగోలు టౌన్‌: ఒంగోలు దక్షిణ బైపాస్‌పై అదుపు తప్పిన కారు బీభత్సం సృష్టించింది. పాదచారులతో సహా ఒక మోటారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఒక మహిళ, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో మహిళ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వస్తున్న కారు దక్షిణ బైపాస్‌లోకి రాగానే జంక్షన్‌కు కొద్ది దూరంలో అదుపుతప్పి అటుగా వెళ్తున్న ఒక మోటారు బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన కవిలా సజనా (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్‌ నడుపుతున్న కొమ్ము ప్రేమ్‌కుమార్‌కు, బాలిక కవిలా ఉజ్వలకు గాయాలయ్యాయి. అయితే కారు డ్రైవర్‌ ఆపకుండా అదే వేగంతో వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాత్లావత్‌ బుజ్జిబాయి (50)ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. గుంటూరు జిల్లా శ్రీరాంపురం తాండాకు చెందిన బుజ్జిబాయి ఒంగోలు శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటూ బైపాస్‌లోని ఒక హోటల్‌లో పనిచేస్తోంది. కారు డ్రైవర్‌ పరారయ్యాడు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

ఆస్పత్రిలో చూపించుకుని వెళ్తుండగా.. 
నగరంలోని దక్షిణ బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కవిలా సజన మరణంతో ఇద్దరు చిన్నారులు తల్లి లేని బిడ్డలయ్యారు. నాగులప్పలపాడు మండలం చౌట­పాలెం గ్రామానికి చెందిన సజనా ప్రేమ్‌ కుమార్‌ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగ లేకపోవడంతో మంగళవారం భర్త, చెల్లి ఉజ్వలతో కలిసి ఒంగోలుకు వచ్చింది. ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో వర్మ హోటల్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచి్చన కారు ఢీకొట్టింది.  

టీడీపీ నాయకుడే కారు డ్రైవర్‌?  
రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు తూర్పు­నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడిదిగా ప్రచారం జరుగుతోంది. అయితే మృతుల బంధువులు కొందరు కారు నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేయగా యజమాని వివరాలు అందుబాటులో లేవని తెలుస్తోంది. ప్రమాదం తరువాత డ్రైవర్‌ పరారయ్యాడని పోలీసులు చెబుతున్నా.. పోలీసుల అదుపులోనే ఉన్నాడని మరికొందరు చెబుతున్నారు. మద్యం తాగి కారు నడిపాడా ? లేక నిద్రమత్తులో ప్రమాదం చేశాడా ? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement