పవన్‌ వస్తే ఏదో జరుగుతుందనుకున్నాం | Bhogapuram Dalits protest in front of the village secretariat | Sakshi
Sakshi News home page

పవన్‌ వస్తే ఏదో జరుగుతుందనుకున్నాం

Jun 30 2026 4:39 AM | Updated on Jun 30 2026 4:39 AM

Bhogapuram Dalits protest in front of the village secretariat

గ్రామ సచివాలయం ఎదుట భోగాపురం దళితుల నిరసన

మురికి కూపంలో జీవిస్తున్నాంఅంటూ మండిపాటు

కనీసం తాగునీరూ ఇవ్వడం లేదని ఆవేదన

పిఠాపురం రూరల్‌: పవన్‌ కళ్యాణ్‌ వస్తే ఏదో జరుగుతుందనుకున్నామని, మురికి కూపంలో జీవిస్తున్నామని పిఠాపురం మండలం భోగాపురం దళిత కాలనీవాసులు మండిపడ్డారు. తమ కాలనీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. నిరసన అనంతరం సచివాలయ సిబ్బందికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. సచివాలయంలో కింద కూర్చుని నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా కాలనీ­వాసులు మాట్లాడుతూ రోడ్లు, డ్రెయినేజీలు లేక మురికి కూపంలో జీవిస్తున్నామని, దళిత కాలనీ అని చిన్నచూపు చూస్తున్నారని, కనీసం తాగు­నీరూ ఇవ్వడం లేదని విమర్శించారు. డ్రెయినేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తోందని, మురుగు నీటి నిల్వ కారణంగా విపరీతమైన దోమలు పెరిగి రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టు­కున్నా పట్టించుకోవడం లేదని, నిధులు లేవంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి కరెంట్‌ పోతోందని, చిన్న పిల్లలు, వృద్ధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీకి శ్మశానం కూడా లేదని, ఎవరైనా చనిపోతే రోడ్డు పక్కన, కాలువ గట్టుపై పూడ్చాల్సిన పరిస్థితులు ఉన్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement