
ఎంబీయూలో ప్రయోగం
లాంచ్ చేసిన మోహన్బాబు, ఇస్రో శాస్త్రవేత్తలు
వాతావరణంపై పలు పరిశోధనలు
చంద్రగిరి (తిరుపతి జిల్లా): వాతావరణంలోని మార్పులు, పీడనతో పాటు మరికొన్ని విశేషాలను తెలుసుకునేందుకు మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) విద్యార్థులు, ఎన్ఏఆర్ఎల్, ఐఐఎస్టీ సహకారంతో రూపొందించిన బెలూన్ శాటిలైట్ శనివారం నింగిలోకి ఎగిరింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్సలర్ మోహన్బాబు, ప్రో చాన్సలర్ మంచు విష్ణులతో పాటు ఇస్రో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వీర ముత్తువేల్, డాక్టర్ కల్పన కాళహస్తి, ఓషన్ శాట్–3 మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ తెన్ముయి శెల్వి , గ్రూపు డైరెక్టర్ గోపికృష్ణతో పాటు ఎన్ఏఆర్ఎల్, ఐఐఎస్టీ శాస్త్రవేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఉదయం 11.15 గంటలకు విద్యార్థులు రూపొందించిన ఎంబీయూ శాట్–1ను మోహన్బాబుతో పాటు శాస్త్రవేత్తలు లాంచ్ చేశారు.
ఎన్ఏఆర్ఎల్తో భాగస్వామ్యం ద్వారా రూ.1.5 లక్షల తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహించిన ఈ బెలూన్ శాటిలైట్ ఇతర విశ్వవిద్యాలయాలకు ప్రామాణికంగామారుతుందని విద్యార్థులు చెప్పారు. సుమారు 5 కేజీల బరువుతో 35 కి.మీ. ఎత్తులో 200 కిలోమీటర్ల వరకూ ఈ శాటిలైట్ ప్రయాణిస్తుందని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఒక యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ విజయవంతం కావడం సంతోషకరమని యూనివర్సిటీ చాన్సలర్ మోహన్బాబు చెప్పారు.