ఇదేనా ప్రజాస్వామ్యం!? | Attacks are increasing day by day | Sakshi
Sakshi News home page

ఇదేనా ప్రజాస్వామ్యం!?

Jun 10 2024 5:05 AM | Updated on Jun 10 2024 7:26 AM

Attacks are increasing day by day

రోజురోజుకూ పెరుగుతున్న దాడులు..

పేట్రేగిపోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు 

చోద్యం చూస్తున్న పోలీసులు 

రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌ కనుసన్నల్లో ఇష్టానుసారం దాడులు చేస్తూ పేట్రేగిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను చితకబాదడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల తొలగింపు, శిలాఫలకాల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ఆటవిక రాజ్యాన్ని తలపిస్తూ పోటీపడి మరీ దాడులు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దుస్తులు విప్పి కొట్టడమే కాకుండా, లోకేశ్‌ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బూతులు తిట్టారు. 

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో 50 ఇళ్లకు మంచి నీరు బంద్‌ చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలో అర్చకత్వ బాధ్యతలు తమ వర్గీయులకు అప్పగించాలంటూ ఓ పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ వర్గీయుల దాషీ్టకాలు ఊరూరా కనిపిస్తున్నాయి. సభ్య సమాజం ఏమనుకుంటుందనే విచక్షణ మరచి బరితెగింపుతో వ్యవహరిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా ఇళ్లలోకి చొరబడి కొడుతున్నారు.

 ఎక్కడో సినిమాల్లో కనిపించే ఇలాంటి దృశ్యాలు ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నిజ జీవితంలోనూ చోటుచేసుకోవడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండటం దారుణం, దుర్మార్గం. పైగా కొన్ని చోట్ల వారే టీడీపీ కార్యకర్తలుగా మారి పూనకం వచ్చినట్లు ఊగిపోతుండటం గమనార్హం. 

ఏ తప్పూ చేయకపోయినా పల్నాడు జిల్లాలో ఊరు విడిచి వెళ్లాలని ఒక ఉప సర్పంచ్‌ను ఓ సీఐ తీవ్రంగా హెచ్చరించడం, బాధితుడు ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకోవడం అరాచకానికి పరాకాష్ట. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలన్నదే బాబు, లోకేశ్‌ల అభిమతంగా అనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement