దళిత రైతులపై దౌర్జన్యం | Atrocities on Dalit farmers | Sakshi
Sakshi News home page

దళిత రైతులపై దౌర్జన్యం

Dec 8 2024 5:29 AM | Updated on Dec 8 2024 5:29 AM

Atrocities on Dalit farmers

జేసీబీలతో పంటలు ధ్వంసం చేసిన పెత్తందారులు

అడ్డుకున్న వారిపై బెదిరింపులు

న్యాయం చేయాలంటూ బాధితుల వేడుకోలు

చంద్రగిరి: తరతరాలుగా కుటుంబమంతా కలిసి ఆరుతడి పంటలను పండించుకుంటూ జీవనం గడుపుతున్న దళిత రైతులపై పెత్తందారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని కాజేయాలని యత్నించారు. అడ్డుకున్న దళి త రైతులపై బెదిరింపులకు పాల్పడిన ఘ టన శనివారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండల పరిధిలోని నరసింగాపురంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నరసింగాపురం హరిజనవాడకు చెందిన కృష్ణయ్య కుమారులు శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణ  సర్వే నంబరు 321లోని సుమారు 20 సెంట్ల భూమిలో ఉమ్మడిగా సాగుచేసుకుంటున్నారు.

ఈ క్రమంలో తమ భూమికి ఆనుకుని ఉన్న బుచ్చినాయుడుపల్సికి చెందిన చిట్టిబాబునాయుడు, మనోహర్‌నాయుడు అక్రమంగా ప్రవేశించి, జేసీబీ లతో హద్దులు తొలగించారని ఆవేదన వ్య క్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కొంతమంది రౌడీలను తీసుకొచ్చి, తమపై దౌర్జన్యం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని లబోదిబోమన్నారు. ఎన్నో ఏళ్లుగా భూమిలో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తుంటే, ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆ వేదన వ్యక్తం చేశారు. 

పెసర, మినుము, జొన్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు సుమారు 30 అడుగుల మేర జేసీ బీతో పంటను ధ్వంసం చేసినట్లు తెలి పారు. కాగా, అక్రమంగా జేసీబీతో హద్దులను తొలగిస్తుండడంతో శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణలు జేసీబీకు అడ్డుగా పడుకుని నిరసనకు దిగారు. తాతముత్తాతల కాలం నుంచి ఉన్న భూమిని ఆక్రమించుకుని తమను వేధిస్తున్నారంటూ వారు తమ గోడు చెప్పుకున్నారు. 

ఇప్పటికే దీనిపై రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడమే మార్గమంటూ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీ­సులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement