
నేటి నుంచి పేదలు దుకాణాలకు వెళ్లాల్సిందే
రేషన్ వాహనాల రద్దుతో ఇంటివద్దకే నిత్యావసరాల సరఫరాకు మంగళం
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంటికే రేషన్ వ్యవస్థతో పేదలకు ఊరట
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు విప్లవాత్మకమైన మార్పు
ఇప్పుడు మళ్లీ రేషన్ షాపుల వద్ద పేదలను క్యూలైన్లలో నిలబెడుతున్న కూటమి ప్రభుత్వం
రేషన్ షాపుల పనివేళలతో కూలీలకు, వ్యవసాయ పనులకు వెళ్లే వారికి ఇబ్బంది
గిరిజన ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన దుస్థితి
ఎండల్లో, వానల్లో చాంతాడంత క్యూలైన్లలో కార్డుదారుల ఎదురుచూపులు.. డీలర్ల దయాదాక్షిణ్యాలు, ఛీదరింపులు.. షాపు నుంచి ఇంటికి మోతబరువు భారం.. ఒకవేళ షాపు తీయకపోతే ఉసూరుమంటూ ఇంటికి తిరుగుముఖం.. డీలర్ల మాయాజాలం, ఎవరూ తీసుకోకపోతే రేషన్ నొక్కేయడం.. ముక్కిపోయిన, పురుగుపట్టిన బియ్యం సరఫరా.. 2019కి ముందు రాష్ట్రంలో రేషన్ షాపుల పరిస్థితి ఇదీ. ఈ కష్టాల నుంచి గట్టెక్కిస్తూ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దుచేసేసింది. మళ్లీ తన పాత విధానాన్నే రాష్ట్ర ప్రజలపై రుద్దుతోంది. అదీ నేటి నుంచే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి (జూన్ 1) నుంచి ప్రజలకు రేషన్ కష్టాలు మొదలుకానున్నాయి. పేదలు రేషన్ సరుకుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించకూడదనే సదుద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేసిన ఇంటి వద్దకే రేషన్ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు) విధానాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దుచేసింది.
మళ్లీ పాత వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల కష్టాలకు తెరతీసింది. ఈ నిర్ణయంతో రేషన్ సరుకుల పంపిణీ ఇక డీలర్ల దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి ఉంటుందని, రేషన్ కష్టాలు, మోత బరువు మళ్లీ దాపురించిందని పేదలు వాపోతున్నారు. అలాగే, 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గరి్వంచదగ్గ వ్యవస్థను, ఒక విప్లవాత్మక సంస్కరణను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు మంచి సేవలు అందిస్తుంటే దానిని అభినందించి కొనసాగించాల్సింది పోయి మళ్లీ పాత విధానంలోకి వెళ్లడాన్ని రేషన్ కార్డుదారులు తప్పుపడుతున్నారు.
‘అసలు ఎండీయూ సేవలకు రేషన్ డీలర్లు ప్రత్యామ్నాయం కాగలరా?.. గడిచిన ఐదేళ్లుగా తప్పిన రేషన్ కష్టాలు మళ్లీ రాకుండా ఉంటాయా? ప్రజల కళ్ల ముందే పారదర్శకంగా సాగిన పంపిణీ, షాపుల ద్వారా అంతే పారదర్శకంగా జరుగుతుందా’ అని లబ్ధిదారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి.. గత ప్రభుత్వంపై అక్కసు, రాజకీయ కక్షతోనే ప్రజా పంపిణీ వ్యవస్థను తిరోగమనంలోకి నెట్టి పేదలను రోడ్డుపాల్జేస్తోందని వారు చంద్రబాబు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
కొత్త రేషన్ షాపులకు బ్రేకులు..
రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను అక్రమ రవాణాకు కేరాఫ్గా కూటమి నాయకులు దు్రష్పచారం చేశారు. ఈ వ్యవస్థను ఆర్థిక భారంగా ముద్రవేశారు. దీనికంటే మెరుగ్గా రేషన్ షాపుల సంఖ్యను పెంచి సరుకులు అందిస్తామని ప్రగల్భాలు పలికారు. గత సెప్టెంబరులో రేషన్ షాపుల హేతుబద్ధికరణలో భాగంగా 2,774 కొత్త షాపులు పెడుతున్నట్లు జీఓ ఇచ్చారు. కానీ, ఈ జీఓకు రేషన్ డీలర్లే బ్రేకులు వేశారు. కోర్టుల్లో కేసులు వేసి కొత్త రేషన్ షాపుల ఏర్పాటును అడ్డుకున్నారు. మరోవైపు.. కొత్త దుకాణాలు పెట్టాలంటే అదనంగా బడ్జెట్ అవుతుంది.
2,774 కొత్త దుకాణాల్లో తూకం పరికరాలు, ఈ–పోస్ మిషన్లు వంటి యంత్రాల కొనుగోలుకు ఏకంగా రూ.11.51 కోట్లు అవుతుంది. దీనికి అదనంగా ఈపోస్ మిషన్ నిర్వహణ కోసం నెలకు రూ.10.12లక్షల చొప్పున ఏడాదికి రూ.1.21 కోట్లు ఖర్చవుతుంది. ఇది కేవలం 2,774 దుకాణాలు ఏర్పాటుచేస్తేనే. ఈ సంఖ్యలో రేషన్ దుకాణాలు పెట్టినా ప్రజలకు చేరువగా పీడీఎస్ సేవలు ఎలా సాధ్యమనేది అనుమానమే. పారదర్శకంగా సేవలందిస్తున్న ఎండీయూను రద్దుచేయడం అనాలోచిత నిర్ణయం కాక మరేమిటని కార్డు హోల్డర్లు ప్రశ్నిస్తున్నారు.
పడిగాపులు తప్పవు
రేషన్ షాపుల పనివేళల వల్ల వ్యవసాయ పనులకు వెళ్లేవారు, కూలీలు ఇబ్బంది పడతారు. ఒకేసారి ఎక్కువమంది లబ్ధిదారులు రేషన్ కోసం వస్తే సర్వర్లు మొరాయిస్తాయి. దీంతో లబ్ధిదారులు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పీడీఎస్నే ఎత్తేసే పరిస్థితి..
2014–19 మధ్య టీడీపీ పాలనలో తినడానికి వీల్లేని ముక్కిపోయిన, రంగుమారిన, పురుగుపట్టిన బియ్యాన్ని సరఫరా చేసేవారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సార్టెక్స్ (నాణ్యమైన) బియ్యాన్ని పంపిణీ చేయడం ద్వారా పేద ప్రజల కడుపు నింపారు. దీంతో పాటు పంచదార, కందిపప్పు, మిల్లెట్స్, గోధుమ పిండి వంటి నిత్యావసరాలను సబ్సిడీపై అందించారు. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది కాలంలో నెమ్మదిగా ఒక్కోటి ఎగిరిపోయాయి. ఇప్పట్లో కందిపప్పు ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే అందిస్తున్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం పేద ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తోంది. ఈ తిరోగమన చర్యలు చూస్తుంటే.. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని రద్దుచేసినట్లుగానే మొత్తం పీడీఎస్నే ఎత్తేసే పరిస్థితి లేకపోలేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
వృద్ధులకు పంపిణీపై విధివిధానాలేవి?
ఇదిలా ఉంటే.. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిస్తామని చెప్పి దానికి తగిన విధివిధానాలు ప్రకటించలేదు. కేవలం రేషన్ డీలర్లకు నోటి మాట ద్వారా చెప్పేసి.. గౌరవంగా సేవలందించాలని సెలవిచ్చేశారు. ఒకవేళ వృద్ధులు, దివ్యాంగుల చెంతకే రేషన్ చేరకపోతే డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది అంతుచిక్కని ప్రశ్న. ప్రభుత్వం 60 ఏళ్లు దాటితే వృద్ధాప్య పింఛన్ ఇస్తుంటే.. రేషన్ పంపిణీకి వచ్చేసరికి 65 ఏళ్లు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గిరిజనులు పనిమానుకుంటేనే..
ఇక గిరిజన ప్రాంతాల్లో ఒక్కో రేషన్ డిపో పరిధిలో పదుల సంఖ్యలో గ్రామాలు ఉంటాయి. రేషన్ డిపోకు, ఆయా గ్రామాలకు 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గిరిజనులు ఒకరోజు పనిమానుకుంటే తప్ప రేషన్ దక్కని పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యం కోసం కొండలు, గుట్టలు దాటుకుని ప్రయాణం చేయాలి. ఈ పరిస్థితుల్లో రేషన్ పంపిణీ శాతం తీవ్రంగా పడిపోయే ప్రమాదం ఉంది. గతంలో డీలర్ల ద్వారా 64 శాతం మాత్రమే పంపిణీ చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అది 90 శాతానికి చేరుకుంది. ఇప్పుడీ ప్రభుత్వ విధానంతో ఎంతమంది తీసుకుంటారనేది అయోమయమే.
డీలర్లకు కమీషన్ చిక్కులు..
రేషన్ డీలర్లు ప్రభుత్వం ఇచ్చే కమీషన్పై సేవలందిస్తారు. ఎక్కువ కార్డులుంటే ఎక్కువ కమీషన్ వస్తుంది. అదే ఒక డీలర్ పరిధిలో కార్డుల సంఖ్య తగ్గిపోతే వాళ్లు రేషన్ దుకాణాన్ని నడిపినా ఆర్థికంగా ప్రయోజనం ఉండదు. కనీసం షాపు అద్దెకు, కూలీల ఖర్చులకు కూడా కమీషన్ సొమ్ములు సరిపోవు. ఎండీయూల ఆర్థిక భారాన్ని తగ్గించుకుని వాటితో డీలర్లు కమీషన్లు పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది జరిగేలా కనిపించడంలేదు. కమీషన్ను పెంచకపోతే డీలర్లకు ఎలా న్యాయం చేస్తారన్నది ప్రశ్న.
రేషన్ షాపుల్లో పారదర్శకత ఏది?
పారదర్శకత కోసం రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు పెడతామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో దుకాణంలో ఒక కెమెరా ఏర్పాటుచేయాలంటే తక్కువలో తక్కువ వైర్లెస్ అయితే సుమారు రూ.8 వేలు, వైర్డ్ అయితే రూ.13 వేలకు పైగా ఖర్చవుతుంది. వీటికి అదనంగా నిర్వహణ ఖర్చులు ఉంటాయి. అంటే.. రూ.50 కోట్లకు పైగా సీసీ కెమెరాలకు వెచ్చించాలి. ఈ బాధ్యత ప్రభుత్వానిదా? రేషన్ డీలర్లదా? ఇప్పటివరకు దీనిపై స్పష్టతలేదు. పైగా ఎటువంటి సీసీ కెమెరాలు లేకుండానే ఇప్పుడు సరుకుల పంపిణీని చేపడుతోంది. దీంతో రేషన్ షాపుల్లో పారదర్శకత ఎలా ఉంటుందనేది మేధావుల ప్రశ్న.