సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్పై దాఖలైన పిల్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.
ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.
గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.


