‘ఈ–వాచ్‌’పై ఎస్‌ఈసీ పూర్తిగా స్పందించాల్సి ఉంది | AP Govt reported to High Court On E-Watch APP | Sakshi
Sakshi News home page

‘ఈ–వాచ్‌’పై ఎస్‌ఈసీ పూర్తిగా స్పందించాల్సి ఉంది

Feb 27 2021 4:13 AM | Updated on Feb 27 2021 4:13 AM

AP Govt reported to High Court On E-Watch APP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) సొంతంగా రూపొందించుకున్న ఈ–వాచ్‌ యాప్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌ఎల్‌) లేవనెత్తిన 24 సందేహాలు, అభ్యంతరాల్లో కేవలం ఆరింటికే ఎస్‌ఈసీ స్పందించిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మిగిలిన వాటికి స్పందన రావాల్సి ఉందని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. తదుపరి విచారణను మార్చి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఈ–వాచ్‌ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లైన ‘సీ–విజిల్‌’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కట్టా సుధాకర్, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అంగ్రేకుల నాగేశ్వరరావు, తెనాలి మండలం బుర్రిపాళేనికి చెందిన అడుసుమల్లి అజయ్‌కుమార్‌ హైకోర్టులో వేర్వేరుగా పిల్స్‌ దాఖలు చేయడం, విచారణ జరిపిన ధర్మాసనం ఈ–వాచ్‌ యాప్‌ను వినియోగంలోకి తేవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించటం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement