అందరికీ పోలియో చుక్కలు వేయించాలి: గవర్నర్‌

AP Governor Harichandan Participated In Polio Program - Sakshi

సాక్షి, అమరావతి : పోలియో రహిత సమాజ స్ధాపనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఇంతకు ముందు వేయించినా, తిరిగి వేయించవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. విజయవాడలోని రాజ్భవన్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గవర్నర్ బీబీ హరిచందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్  హరిచందన్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు నిరంతరంగా చేపడుతున్న చర్యల ఫలితంగా 2011 నుండి భారత దేశంలో ఒక్క పోలియో బాధిత కేసు కూడా నమోదు కాలేదన్నారు.

తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ద చేయకుండా ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించాలని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 52.72 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కల వేయాలన్నది లక్ష్యంగా అన్నారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాలలోని చిన్నారులు సమీపంలోని పోలీసు పోలియో చుక్కల కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్ల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్, రాష్ట్ర రోగ నిరోధక అధికారి డాక్టర్ దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  డాక్టర్ సుహాసిని తదితర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top