ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్‌

AP Assembly Session: CM Jagan On Investments, Industrial Progress - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శుక్రవారం పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో కొన్ని శక్తులు పథకాలను అడ్డుకుంటున్నాయి. కోవిడ్‌ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా మన ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది. 98.4 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వంగా నిలిచాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగున్నా ఓ దొంగల ముఠా దుష్ప్రచారం చేస్తోంది. గోబెల్స్‌ ప్రచారంలో భాగంగా అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం బాగున్నా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర జీడీపీ పెరుగుదల గతంలో కంటే బాగుంది. 

కోవిడ్‌ సంక్షోభంలోనూ జీడీపీ పెరుగుదల
కోవిడ్‌ సంక్షోభాన్ని తట్టుకొని నిలబడ్డాం. కోవిడ్‌ దెబ్బకు దేశాల్లో డీజీపీ తగ్గిపోయింది. దేశంలో పలు రాష్ట్రాల్లోనూ జీడీపీ తగ్గింది.  2018-19లో జీడీపీ 5.36 ఉంటే ఇప్పుడు 6.89 శాతం ఉంది. దేశంలో జీడీపీ పరంగా ఆరోస్థానానికి చేరుకున్నాం. జీడీపీ పరంగా దేశంలో గతంలో 21వ స్థానంలో ఉంటే ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నాం. గ్రోత్‌ రేట్‌లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. దేశ జీడీపీలో గతంలో రాష్ట్రవాటా 4.45% ఉంటే ఇప్పుడు 5శాతానికి పెరిగింది. దేశంలో నాలుగు రాష్ట్రాల్లోనే జీడీపీ పెరుగుదల నమోదైంది. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్లే ఆర్థిక వ్యవస్థ మెరుగైంది. అ‍మ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్లు, రైతు భరోసా వంటి పథకాలతో పేదలను ఆదుకోవడం వల్ల ఏపీ పాజిటివ్‌ గ్రోత్‌రేట్‌ సాధించింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సరైన సమయంలో ప్రజలకు ఆర్థిక చేయూత అందించాం. ప్రభుత్వం చేస్తున్న మంచిని జీర్ణించుకోలేకపోతున్నారు. 

రాష్ట్ర అప్పులపై ఎల్లోమీడియా దుష్ప్రచారం
అప్పులపై ఎల్లోమీడియా, చంద్రబాబు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారు. విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.2.69 లక్షల కోట్లు. బాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123శాతం అప్పులు పెరిగాయి. ఈ మూడేళ్లలో 3.82 లక్షల కోట్లకు రుణాలు చేరాయి. మూడేళ్లలో పెరిగిన రుణం 41.83 శాతం మాత్రమే. ఈ మూడేళ్లలో రాష్ట్ర అప్పులు 12.73శాతం మాత్రమే. ప్రభుత్వ గ్యారంటీతో చేసిన రుణాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువ.

2014 నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు 14,028 వేల కోట్లు. చంద్రబాబు దిగిపోయేటప్పటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు 59,257కోట్లు. ఈ మూడేళ్లో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. గత అప్పుతో కలుపుకుంటే రుణాలు రూ.4.99లక్షల కోట్లకు చేరాయి. ఈ మూడేళ్లలో పెరిగిన రుణం 52శాతం మాత్రమే. గత ప్రభుత్వం హయాంలో పెరిగిన రుణాలు 144 శాతం. చంద్రబాబు హయాంలో 17.45 శాతం అప్పులు పెరిగాయి. మన హయాంలో 12.73శాతం మాత్రమే పెరిగాయి. ఈ వాస్తవాలు రాయకుండా దుష్పచారం చేస్తున్నారు. 

కేంద్రంతో పోలిస్తే తగ్గిన ఏపీ ప్రభుత్వం అప్పు
2014-19 వరకు కేంద్ర అప్పులు 59% పెరిగితే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు 123శాతానికి పెరిగాయి. ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు రూ.135లక్షల కోట్లకు పెరిగాయి. మూడేళ్లలో కేంద్రం అప్పులు 43.8 శాతం పెరిగాయి. ఈ మూడేళ్లో రాష్ట్ర రుణాలు 3.82లక్షల కోట్లకు పెరిగాయి. ఈ మూడేళ్లలో 41.4శాతం పెరిగాయి. కేంద్రంతో పోలిస్తే ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పు తగ్గింది. చంద్రబాబు హయాంలో కేంద్రం కంటే రాష్ట్ర అప్పులు ఎక్కువగా ఉండేవి. 

అప్పుల గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి. ఎవరి హయాంలో దోచుకో పంచుకో తినుకో జరిగిందో తెలియాలి. అప్పులు తిరిగి చెల్లించలేకపోతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర సొంత ఆదాయం గతంలో 62వేల కోట్లు. ఇప్పుడు 75వేల కోట్లు. మూల ధనవ్యయం అసలు జరగడం లేదని దుష్పచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగానే మూలధన వ్యయం ఉంది. గత ప్రభుత్వం కింద 76,139 కోట్లు ఖర్చు చేసింది. మనం మూడేళ్లలో రూ.55,086 కోట్లు ఖర్చు చేశాం. మూలధన వ్యయం తక్కువగా ఉందన్నది అవాస్తవమని సీఎం జగన్‌ అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top