
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు 5 వేల ఎకరాలు
స్మార్ట్ ఇండస్ట్రీస్కు 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు
ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ.. భూసేకరణకు మంత్రివర్గ ఆమోదం.. వచ్చే నెలలో నోటిఫికేషన్
జీఏడీ, హెచ్వోడీ టవర్ల నిర్మాణం ఎన్సీసీ, ఎల్అండ్టీ, షాపూర్ పల్లోంజీకి..
తెలంగాణతో చర్చించి వివాదం లేకుండా పోలవరం–బనకచర్ల
బిల్డర్లకు వెసులుబాటుగా నిర్మాణ నిబంధనల్లో మినహాయింపులు, సరళతరం..
ఈ ఏడాది, వచ్చే ఏడాది పొగాకు పంట సాగుకు హాలిడే
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు నారాయణ, పార్థసారథి
సాక్షి, అమరావతి: రాజధాని కోసం గతంలో సీఆర్డీఏ తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్స్ రావాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అప్పుడే టూరిజం... తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, ఇవన్నీ ఉండడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను నారాయణ, సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి వేర్వేరుగా మీడియాకు వెల్లడించారు.
‘‘2015 జనవరి నాటి ల్యాండ్ పూలింగ్ నియమ నిబంధనలను పునరుద్ధరించాం. వాటి ఆధారంగా కొత్తగా 45 వేల ఎకరాలు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును 5వేల ఎకరాల్లో నిర్మించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాల్లో వస్తాయి. కనీసం 45 వేల ఎకరాలు పూలింగ్ చేస్తే తప్ప వీటిని అభివృద్ధి చేయలేం. ఈ మొత్తం భూమి కేపిటల్ సిటీ 29 గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. భూసేకరణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేస్తాం’’ అని నారాయణ చెప్పారు.
భవన నిర్మాణ నిబంధనలు సరళీకరణ
» భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించినట్లు నారాయణ తెలిపారు. అపార్ట్మెంట్లు్ల, గ్రూప్ డెవలప్మెంట్ ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, థియేటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి అని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి ఇప్పటికాదా టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని, అదే కట్టడంపై నిర్మాణం చేస్తే ఆ బాండ్లను వాడుకోవచ్చన్నారు.
» గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, యూనివర్సిటీలు, ఆస్పత్రుల వంటి భవిష్యత్ అవసరాల కోసమే అమరావతిలో మరోసారి భూ సమీకరణ అని పార్థసారథి పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని భూముల సమీకరణకు ఒకే తరహా నిబంధనలు (యూనిఫాం రూల్స్)ను ఆమోదించినట్లు చెప్పారు. ‘‘ఎన్జీటీ, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా జలాశయాల రక్షణకు చర్యలు తీసుకుంటాం.
అసైన్డ్, దేవాదాయ, లంక భూములను జాయింట్ కలెక్టర్ ద్వారా విచారణ చేసి యాజమాన్యాలను నిర్ధారిస్తాం. సరిహద్దు వివాదాలు లేకుండా డ్రోన్స్ సర్వే చేస్తాం. ఆధార్ ద్వారా భూ యజమానులను నిర్ధారిస్తాం. భూమి లేనివారికి నెలకు రూ.5 వేలు చొప్పున పదేళ్ల పాటు పెన్షన్, ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తాం. రైతుల వ్యవసాయ రుణాలను రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తాం’’ అని వివరించారు.
కేబినెట్ భేటీలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..
» అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్లో భాగంగా జీఏడీ, హెచ్వోడీ టవర్ల నిర్మాణాలను రూ.844 కోట్లతో ఎన్సీసీకి, రూ.1,423 కోట్లతో షాపూర్ పల్లోంజీకి, రూ.1,247 కోట్లతో ఎల్అండ్టీకి ఇచ్చేందుకు ఆమోదం.
» అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు 50 ఎకరాలను చదరపు మీటర్కు ఏడాదికి రూపాయి చొప్పున 60 ఏళ్లు లీజుకిచ్చేందుకు అంగీకారం.
» అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి డిప్యుటీ కలెక్టర్ ఉద్యోగం.
» జాప్యం కారణంగా నంద్యాల జిల్లాలో టయారో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో అరబిందో రియాల్టీ– ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్)కు కేటాయించిన 800 మెగావాట్ల అవుకు ప్రాజెక్టు రద్దు.
» చిత్తూరు జిల్లా శాంతిపురం, కుప్పం మండలాల్లో వి.కోట, రామకుప్పం వద్ద పాలార్ నదిపై 17 చెక్ డ్యాముల మరమ్మతు, పునర్నిర్మాణానికి రూ.5,355 లక్షలకు, పాలార్ నదిపై 4 చెక్ డ్యాముల మరమ్మతుకు రూ.1,024.50 లక్షలకు పరిపాలనా ఆమోదం.
» వైఎస్సార్ కడప జిల్లా గండికోట వద్ద ఓబెరాయ్ (విల్లాస్) రిసార్ట్ అభివృద్ధి కోసం 50 ఎకరాలు ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.
» ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వేడుకల సభలు నిర్వహణ.