స్టార్టప్స్‌కు డెస్టినేషన్‌గా ఏపీ | Andhra Pradesh as a destination for startups | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌కు డెస్టినేషన్‌గా ఏపీ

Feb 11 2024 4:59 AM | Updated on Feb 11 2024 4:59 AM

Andhra Pradesh as a destination for startups - Sakshi

విశాఖలో జరిగిన ఏఐ క్లౌడ్‌ సమ్మిట్‌–2024లో మాట్లాడుతున్న సురేష్‌ బాత్ర

సాక్షి, విశాఖపట్నం: స్టార్టప్స్‌ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందుతోందని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) అడిషనల్‌ డైరెక్టర్‌(ఏడీ) సురేష్‌ బాత్రా అన్నారు. డీప్‌ టెక్‌ నైపుణ్య ఫౌండేషన్‌ (డీటీఎన్‌ఎఫ్‌) అధ్వర్యంలో విశాఖలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్డన్స్‌ ఎరీనాలో శనివారం నిర్వహించిన ఏఐ క్లౌడ్‌ సమ్మిట్‌–2024ను సురేష్‌బాత్ర, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ డా.రవిశంకర్‌ ప్రారంభించారు. సురేష్‌ మాట్లాడుతూ ఏపీలో స్టార్టప్‌లకు ఎకోసిస్టమ్‌ అద్భుతంగా ఉందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుకూల వాతావరణం ఏపీలో ఉండటంతో కొత్త ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు.

ఐటీ, అనుబంధ పరిశ్రమలకు విశాఖ కీలకంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టార్టప్స్‌లో మూడోవంతు విశాఖలోనే ఉన్నట్లు తెలిపారు. సీపీ రవిశంకర్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అనేది నేరస్తులను గుర్తించేందుకే కాకుండా నేర నియంత్రణకు, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీ ఇన్నోవేటివ్‌ సొసైటీ సీఈవో అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంక్యుబేషన్‌ సెంటర్లలో స్టార్టప్‌ సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.

డీప్‌టెక్‌ నైపుణ్య ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ శ్రీధర్‌ కొసరాజు మాట్లాడుతూ భారత్‌లో ఉన్న ఎంఎన్‌సీ, హైటెక్‌ కంపె­నీలకు చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా డీటీఎన్‌ఎఫ్, ఏపీఐఎస్‌ మధ్య కృత్రిమ మేధకు సంబంధించిన ఎంవోయూ జరిగింది. సదస్సులో ఏఐ, క్లౌడ్‌ కంప్యూ­టింగ్‌ నిపుణులు ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement