Andhra Pradesh: 16 మంది ఐఏఎస్‌ల బదిలీ

Andhra Pradesh: 16 IAS Officers Transferred Across State - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లా కలెక్టర్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు. పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్లను బదిలీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

దేవదాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌గా పని చేస్తోన్న పి.అర్జునరావును ఏపీ స్టేట్‌ హ్యాండ్‌ లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌గా నియమించారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పని చేస్తోన్న జి.వాణీమోహన్‌ను దేవదాయ శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. 
విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ పి.కోటేశ్వరరావును కర్నూలు జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా అండ్‌ రెవెన్యూ) కె.వెంకటరమణారెడ్డిని నియమించారు.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డిని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ.. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపీఎంఎస్‌ఐడీసీ) వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఇక్కడ పని చేస్తోన్న విజయ్‌రామరాజును వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. 
వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

విశాఖ కలెక్టర్‌గా పనిచేస్తోన్న వాడరేవు వినయ్‌చంద్‌ను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ.. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఇక్కడ పనిచేస్తోన్న డాక్టర్‌ ఎ.మల్లిఖార్జునను విశాఖ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.
పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఎం.ప్రభాకర్‌రెడ్డిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. 
విజయనగరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ను ఆర్‌ అండ్‌ ఆర్‌ కమిషనర్‌గా నియమించారు. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.సూర్యకుమారిని విజయ నగరం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఈమె స్థానంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండ్యన్‌ను నియమించారు. 
శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌ బీ అండ్‌ ఆర్‌) సుమిత్‌ కుమార్‌ను పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌బీ అండ్‌ ఆర్‌)గా బదిలీ చేయగా, ఏపీ స్టేట్‌ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సోసైటీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీగా పని చేస్తోన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను శ్రీకాకుళం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌ బీ అండ్‌ ఆర్‌)గా బదిలీ చేశారు. 
కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా పని చేస్తోన్న స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను చిత్తూరు జాయింట్‌ కలెక్టర్‌ (ఆర్‌బీ అండ్‌ ఆర్‌)గా బదిలీ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top