సాక్షి, తాడేపల్లి: అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. అమరావతి రైతులకు ధైర్యం ఛెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది..: రైతులు
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు.

కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది.దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగలేదు.బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి’ అని కోరారు.


రైతుల్ని బలవంత పెట్టడం సరికాదు: వైఎస్ జగన్
అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు సంతోష పెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్ట పెట్టేలా చేయకూడదు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు.

ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు.

భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు.కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి.

దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలి.రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోంది. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు.


