మే 3 నుంచి ఢిల్లీకి ఎయిరిండియా సర్వీస్‌

Air India service to Delhi from May 3 - Sakshi

విమానాశ్రయం (గన్నవరం): సాంకేతిక కారణాల వల్ల 2 నెలలుగా నిలిచిపోయిన ఎయిరిండియా ఉదయం విమాన సర్వీస్‌ను మే 3వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ విమాన సర్వీస్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌ను కూడా ఆ సంస్థ ప్రారంభించింది. ఈ విమానం ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 8.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.15 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుతుంది. జూన్‌ నుంచి ఈ సర్వీస్‌ను వారానికి 7 రోజుల పాటు నడపనున్నారు.

ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ–విజయవాడ మధ్య గతంలో రోజుకు 3 విమాన సర్వీస్‌లు నడిచేవి. కోవిడ్‌ ప్రభావం వల్ల సాయంత్రం విమాన సర్వీస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 2 నెలలు క్రితం ఉదయం సర్వీస్‌ నిలిచిపోగా, ప్రస్తుతం రాత్రి సర్వీస్‌ మాత్రమే నడుస్తోంది. దీనివల్ల టికెట్ల రేట్లు గణనీయంగా పెరగడంతో పాటు ఇక్కడి నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎయిరిండియా సంస్థ ఉదయం సర్వీస్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top