తిరగబడ్డ టీచర్లు | 60000 SGTs to be reassigned in teacher transfers | Sakshi
Sakshi News home page

తిరగబడ్డ టీచర్లు

Jun 9 2025 2:13 AM | Updated on Jun 9 2025 5:43 AM

60000 SGTs to be reassigned in teacher transfers

మాట తప్పిన సర్కారు.. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఎస్జీటీల బదిలీలు 

మాన్యువల్‌గా నిర్వహిస్తామని ఇచ్చిన హామీకి మంగళం

ప్రస్తుత బదిలీల్లో 60 వేల మంది ఎస్జీటీలకు స్థాన చలనం

ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌తో సమస్యలున్నాయని తీవ్ర వ్యతిరేకత

బదిలీ చట్టం, జీవోలోనూ ఆన్‌లైన్‌ విధానమేనని పేర్కొన్న ప్రభుత్వం

అయినప్పటికీ మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపడతామని హామీ 

చివరిదాకా మభ్యపెట్టి ఇప్పుడు ఆన్‌లైన్‌ విధానం అమలు 

రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్న ఉపాధ్యాయులు

ఆయా జిల్లాల డీఈవో కార్యాలయాల ఎదుట ధర్నాలు

నేడు నిరాహార దీక్షలు, రేపు డైరెక్టరేట్‌ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల పిలుపు

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ అభాసుపాలైన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ బదిలీలను సైతం ప్రహసనంగా మార్చేసిందని ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. సంఖ్యాపరంగా అధికంగా ఉన్న ఎస్జీటీలకు మాన్యు­వల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించడంపై వారు తిరుగు­బాటు ప్రకటించారు. ఒక్కో ఎస్జీటీ 2,500కు పైగా ఆన్‌లైన్‌ ఆప్షన్లు ఇవ్వడం అసాధ్యమని, అదీ కేవలం 48 గంటల్లో పూర్తి చేయాలనడంపై మండిపడుతున్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని భావించిన వారికి శనివారం ఆన్‌లైన్‌ విధానం మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో కంగుతిన్నారు. దీంతో శనివారం బదిలీ కౌన్సెలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో నిరసన తెలిపిన ఎస్జీటీలు.. ఆదివారం బదిలీ కౌన్సెలింగ్‌ను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లు, డీఈవో కార్యాలయాలను ముట్టడించారు. 

ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో 1.79 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, ఎస్జీటీలు 1.20 లక్షల వరకు ఉన్నారు. ప్రస్తుత బదిలీల్లో సుమారు 65 వేల మందికి స్థాన చలనం కల్పించాలి. వీరిలో 35 వేల మంది వరకు ఎనిమిదేళ్లు పూర్తయ్యి, తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు. విద్యా శాఖ గత నెలలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 10వ తేదీతో ఎస్జీటీల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగియాలి. కానీ ఆందోళన నేపథ్యంలో ఆ ప్రక్రియకు బ్రేక్‌ పడినట్టయింది. 

మాన్యువల్‌కు హామీ.. ఆన్‌లైన్‌కు ఉత్తర్వులు 
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో విద్యా రంగంలో చేయాల్సిన మార్పులపై సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రతి శుక్రవారం విద్యాభవన్‌లో జరిగే ఈ సమావేశాల్లో ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్, 3–5 తరగతులు తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. గత 9 నెలల్లో 40కి పైగా సమావేశాలు నిర్వహించి, ప్రతి సమావేశంలోనూ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 

అయితే, ప్రభుత్వం మార్చి నెలలో ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం–2025’ తీసుకొచ్చింది. ఇందులో పలు అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తి ఆందోళన వ్యక్తం చేయడంతో తుది చట్టంలో మార్పులు చేస్తామని నాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఏప్రిల్‌లో చేసిన ‘ఉపాధ్యాయ బదిలీల నియంత్రణ చట్టం–2025’లో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ అని పేర్కొన్నారు. గత నెలలో జరిగిన సమావేశంలో మాన్యువల్‌ కౌన్సెలింగ్‌పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించి నిరసన తెలిపారు. 

అయితే, మరుసటి రోజే విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసి, ఎస్జీటీల డిమాండ్‌ మేరకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వు (జీవో నం.22)లో మళ్లీ ఆన్‌లైన్‌ విధానమే ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఉపాధ్యాయులను మభ్యపెడుతూ వచ్చిన ప్రభుత్వం, కౌన్సెలింగ్‌ ప్రక్రియ దగ్గర పడేసరికి ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లోనే ఆప్షన్లు పెట్టాలని, 48 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఒత్తిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

నిలువునా మోసం చేశారు
» సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలను మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ విధానంలోనే చేపడతామని ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. నమ్మించి మోసం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆదివారం ఉపాధ్యా­యులు ముట్టడి­ంచారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ వద్దు, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ముద్దు.. అంటూ ఉపాధ్యా­యులు చేసిన నినా­దా­లతో డీఈఓ కార్యాలయాల ప్రాంగణాలు మార్మో­గా­యి. ఈ సందర్భంగా డీఈవోలను ఘెరావ్‌ చేశారు. 

»  ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లకు వెబ్‌ కౌ­న్సె­లింగ్‌ను తప్పుల తడకగా నిర్వహించారని, ఎక్కు­వ పాయింట్లు వచ్చిన వారికి కాకుండా తక్కువ పాయింట్లు వచ్చిన వారికి క్లస్టర్‌ వేకెన్సీల్లో అవకాశం ఇచ్చారని ఈ సందర్భంగా పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షి­యల్‌ కేటగిరీ ఉపాధ్యా­యులు జనరల్‌ ఆప్షన్లు పెట్టి­నా ప్లేసులు కేటాయించక పోవడం అన్యాయమ­న్నారు. 

» రాష్ట్ర ప్రభుత్వ తీరు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయ­కులు మండిపడ్డారు. ఉపాధ్యాయుల హక్కులు, ఆత్మ గౌరవంతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఈ–మెయిల్, వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌లు పంపాల­న్నారు. 

విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని, ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్దపె­ట్టున నినాదాలు చేశారు. మాన్యువల్‌గా కౌన్సిలింగ్‌ నిర్వహించకపోతే ఎంత దూరమైనా పోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. చిత్తూరులో మండుటెండలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. 

»  నిరసన కార్యక్రమంలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూ­టీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్సార్‌ టీఏ, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్‌ఆర్‌టీఎఫ్, ఎ­న్టీ­ఏ, ఎస్సీ, ఎస్టీ యూనియన్‌ తదితర సంఘాల నా­య­­­­కులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొ­న్నా­రు.

ఉపాధ్యాయుల కడుపు కొడుతున్న చంద్రబాబు
ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు తనకు మద్దతుగా నిలవడంతో తన కడుపు నిండిపో­యి­ందన్న ముఖ్యమంత్రి చంద్ర­బాబు.. ఇప్పుడు ఉపాధ్యాయుల కడు­పుకొ­డు­తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా, ఉపాధ్యాయులు, ఉద్యోగుల గురి­­ంచి ఆలోచించిన పాపాన పోలేదు. 

వరల్డ్‌ బ్యాంక్‌ నిబంధనలకు అనుగుణంగానే సాల్ట్‌ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడు­గులు వేస్తోంది. ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. – బొర్రా గోపిమూర్తి, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ఉద్యమం మరింత ఉధృతం
ఉపాధ్యాయుల బదిలీల్లో ఎస్జీటీలు, సమాన కేడర్‌ టీచర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఉద్యామాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలను ముట్టడించారు.   సోమవా­రం ఆయా డీఈవో కార్యాలయాల వద్ద నిర­హార దీక్ష చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ప్రభుత్వం అప్ప­టికీ దిగిరాకపోతే మంగళవారం విద్యా భవన్‌ (డైరెక్టరేట్‌)ను ముట్టడికి తరలి రావాలంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement