
సత్యదేవుడు, అమ్మవారికి వజ్ర కర్ణాభరణాలు కూడా..
రూ.2 కోట్లతో తయారు చేయించిన దాత మట్టే సత్యప్రసాద్
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి 134వ ఆవిర్భావ దినోత్సవాలు (జయంత్యుత్సవాలు) సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. దీన్ని పురస్కరించుకుని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు వజ్ర కిరీటం సమర్పించనున్నారు.
సోమవారం మ«ధ్యాహ్నం స్వామివారి ప్రధాన ఆలయంలో రూ.1.50 కోట్ల విలువైన ఈ వజ్రకిరీటాన్ని అందజేయనున్నట్లు సత్యప్రసాద్ తెలిపారు. ఈ కిరీటంతో పాటు స్వామి, అమ్మవార్లకు రూ.50 లక్షలతో చేయించిన వజ్ర కర్ణాభరణాలు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. కాగా, ఇకపై ప్రతి రోజూ స్వామి, అమ్మవార్లు ఈ వజ్రకిరీటాలు, వజ్ర కర్ణాభరణాలు ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.