రూ.100 కోట్ల రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా | 100 crore land encroachment: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్ల రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా

Jun 23 2026 5:31 AM | Updated on Jun 23 2026 5:31 AM

100 crore land encroachment: Andhra Pradesh

రిటైర్డ్‌ ఆర్టీవో భూమిని కబ్జా చేసి వెంచర్‌కు ముఖద్వారం నిర్మిస్తున్న దృశ్యం

రికార్డులు తారుమారు చేసి తప్పుడు పత్రాలతో స్వాధీనం

చక్రం తిప్పిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే, చేతులు కలిపిన మంత్రి 

1986 నాటి సేల్‌డీడ్‌ను రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం

రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చి తహసీల్దార్‌ నోటీసులు

మర్నాడే గుట్టుగా డెవలపర్ల చేతికి భూమిని అప్పగించేసిన అధికారులు

3.17 ఎకరాలను ప్లాట్లుగా మార్చిన ఎస్‌ఎల్‌ఎన్‌ డెవలపర్స్‌ సంస్థ

22ఏ నుంచి తొలగించి... ఆపై డెవలపర్స్‌కు రిజిస్ట్రేషన్‌ చేసిన వైనం

మలిసంధ్యలో కోర్టులు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న బాధిత వృద్ధ దంపతులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు నేతృత్వంలో కూట­మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజ­ల భూములకు రక్షణ కరువైంది. కోట్ల విలువ చేసే భూ­ము­లను తప్పుడు పత్రాలతో కబ్జా చేసి పాగా­వేస్తు­న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా­లోనే ఈ తరహా భూ కబ్జాలు పెరిగిపోవడం గమ­నార్హం. కూటమినేతల భూదందాలు చూసి ప్రజలు భయ­భ్రాంతులకు గురవుతున్నారు. తిరు­పతి పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు ఏ స్థాయి­లో పెరుగుతున్నాయో అదే స్థాయిలో అధికార పార్టీ నేతల ఆగడాలూ పెరి­గి­పో­తున్నాయి. తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో రూ.100కోట్ల విలువైన భూమి­ని తప్పుడు పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులతో కబ్జా చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

ఆ కబ్జా వెనుక చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అధికారుల పాత్ర ఉందని చెబుతున్నారు. రవాణా శాఖలో ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన సొమ్ముతో ఆ భూమిని కొనుగోలు చేశానని, ఇప్పుడు దానిని ఎస్‌ఎన్‌ఎల్‌ డెవలపర్స్‌ సంస్థకు అమ్మేసినట్టు ఆన్‌లైన్‌ చేసుకు­న్నారని వృద్ధ దంపతులు ఆరోపించారు. బాధితుల వివరాల మేరకు... పీలేరులోని ఎర్ర­మిట్టకు చెందిన రిటైర్డ్‌ ఆర్టీవో ద్వారకానాథ్‌ రెడ్డి కుటుంబం 2002–03లో తిరుపతి మండలం అవిలాల పరిధిలోని సర్వే నంబర్‌ 476/1లో 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి తన భార్య వనజ పేరుతో ఆన్‌లైన్‌ అయ్యిందని, ఈసీతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా తమ పేర్లు ఉన్నాయని ద్వారకానాథరెడ్డి పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చి వివాదం సృష్టించిందని... అనంతరం తాము కొను­గోలు చేసిన భూమి చెల్లదంటూ గత ఏడాది ఆగస్టు 25న తిరుపతి రూరల్‌ తహసీల్దార్‌ నోటీసులు ఇచ్చార­ని తెలిపారు. 1986 నాటి సేల్‌డీడ్‌ను రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్‌ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయి­తే ఆ మరుసటి రోజే ఇతరుల పేరుతో జీపీఏ, రిజి­స్ట్రేషన్లు జరగడానికి అవకాశం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భూమిపై గేటెడ్‌ కమ్యూనిటీ, ఎస్‌ఎన్‌ఎల్‌ డెవలపర్స్‌ పేరుతో ప్లాట్లు వేసి విక్రయాలకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అనుచరుల పాత్ర ఉందని ఆరోపించారు.

నాని అనుచరుడు అశోక్‌రెడ్డి పేరిట జీపీ 
చంద్రగిరి ఎమ్మెల్యే పులి­వర్తి నాని అనుచరుడు అశోక్‌ రెడ్డి పేరుతో జీపీ చేశారని, గత ఏడాది ఆగస్టు 26న కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన దోనేపూడి విష్ణు శివ నాగప్రసాద్‌ పేరుతో 35 మంది చేత ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్, ఇతర తనిఖీలు చేయకుండానే తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ విజయ్‌­కుమార్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారని బాధితురాలు వనజ ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూ, ఆర్డీవో కోర్టులో అప్పీలుకు వెళ్లామని, స్టే ఆర్డర్‌ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను ప్రశ్నించగా పెద్ద వాళ్లు ఒత్తిడి చే­యడం వల్లే రిజిస్ట్రేషన్‌ చేశామంటూ తప్పించుకుంటున్నారని చెబుతున్నారు. వృద్ధ వయసులో ఉన్న తమ భూమిపై ఎమ్మెల్యే, మంత్రి కన్నేసి కబ్జా చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరుపతి 10వ అదనపు కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తుడా అనుమతు­లకు ఫైళ్లను పంపించగా అక్కడి అధికారులు అన్ని రకాల దస్త్రా­లను అందజేయాలని కోరడంతోపాటు కోర్టులో కేసు నడుస్తున్నందున అనుమతులు ఇవ్వలేమని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు అడ్డు చెప్పారని బాధితులు తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కబంద హస్తాల నుంచి తమ భూమిని కాపాడాలని వనజ కోరుతున్నారు.

పట్టా భూములకూ రక్షణ కరువైంది
రిటైర్‌మెంట్‌ డబ్బులతో 2002 – 03 మధ్య కొనుగోలు చేసిన భూమిని మంత్రి అనగాని, ఎమ్మె­ల్యే నాని అనుచరు­లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. చంద్రబాబు ప్రభు­త్వంలో ప్రభుత్వ భూ­ములకే కాకుండా పట్టా భూము­లకు కూడా రక్షణ కరువైంది. 1986 నుంచి ఉన్న రిజిస్ట్రేషన్‌ను నిషేధిత భూముల జాబితాలో  ఉందంటూ లిటిగేషన్‌ సృష్టించారు. మేము కొనుగోలు చేసినప్పటికే 20కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగితే నిషేధిత జాబితాలోకి ఎలా చేరుతుంది. వెబ్‌ల్యాండ్‌లో మా పేరు తొలగించి మంత్రి అను­చరులు పేరును చేర్పించుకున్నారు. రూ.100 కోట్ల విలువైన భూమిని ఇప్పు­డు డెవలపర్స్‌ పేరిట ఆన్‌లైన్‌ చేసేశారు. తహసీల్దా­ర్‌ను అడిగితే కోర్టులో చూసుకోమని చెబుతున్నారు. – ద్వారకానాథ్‌రెడ్డి, రిటైర్డ్‌ ఆర్టీవో, పీలేరు

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
తిరుపతి రూరల్‌ మండలం అవిలాల రెవెన్యూ గ్రామంలో రూ.100 కోట్లకు పైగా విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని భారీ భూదందా సాగుతోందని తిరుపతి రూరల్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు విడుదల మాధవరెడ్డి ఆరోపించారు. ఆ మేరకు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవిలాల రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 476/1లో భూమిపై హక్కులు లేని వ్యక్తులు తప్పుడు పత్రాలు, నకిలీ ఆధారాలతో రిజిస్ట్రేషన్లు సృష్టించి చేతులు మారుస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ భూవ్యవహారంపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మంత్రి అనగాని సత్య­ప్రసాద్‌ పేర్లను ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ గానీ, చర్యలు గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తిరుపతికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ప్రస్తుతం వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుండటంతో భూ మాఫియా కన్ను పడిందని ఆరోపించారు. ‘మూడు రోజుల్లో భూ దోపిడీపై చర్యలు ప్రారంభించకపోతే తహసీల్దార్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు, భారీ ప్రజా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ భూములను దోచుకున్న వారిని ప్రజల ముందు నిలబెడతామని ఎంపీపీ మాధవరెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement