రాయదుర్గంటౌన్: పట్టణంలోని అనంతపురం రహదారి ఆర్టీసీ డిపో ఎదురుగా ఈశ్వర్నగర్ 3వ క్రాస్లో నివాసం ఉంటున్న ఫొటోగ్రాఫర్ ఆనంద్ ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటి తలుపును దుండగులు పెకలించి లోపలికి ప్రవేశించి, బీరువాలోని రూ.30 వేల నగదు, 20 గ్రాముల బంగారు నగలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. యజమాని ఆనంద్ కర్ణాటకలోని కుడితిని గ్రామానికి వెళ్లి శనివారం ఇంటికొచ్చి చూస్తే తలుపులు తీసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విద్యార్థినిపై హత్యాయత్నం కేసు విచారణ
పెద్దవడుగూరు : మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని హర్షిత అనే విద్యార్థిని లంచ్ బాక్సులో గుర్తు తెలియని వ్యక్తులు విషపదార్థం కలిపిన విషయం విదితమే. దీనిపై స్పందించిన పోలీసులు సీఐ నరేంద్రరెడ్డి శనివారం పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. బాలిక తల్లిదండ్రులను పిలిచి విచారణ చేశారు. తమకు ఎవరితోనూ ఘర్షణలు, విభేదాలు లేవని విద్యార్థిని తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.


