అనంతపురం అర్బన్: గిరిజనుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన కాలనీల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కొన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు లేవన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
అనంతపురం న్యూ టౌన్: గిరిజనుల సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ లక్ష్యమని చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్–నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక పంటలు దెబ్బతిన్నాయని, రైతులను, కూలీలను ఆదుకోవాలని గిరిజనుల నుంచి అర్జీలు అందాయని తెలిపారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన ప్రజల నుంచి పలు సమస్యలతో కూడిన అర్జీలను కమిషన్ బృందం స్వీకరించింది.
విజయవాడకు వెళ్లిన కలెక్టర్
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నుంచి రెండురోజుల పాటు కలెక్టర్లతో నిర్వహించనున్న కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు కలెక్టర్ ఆనంద్ బుధవారం విజయవాడకు వెళ్లారు. జిల్లాకు సంబంధించిన నివేదికను కాన్ఫరెన్స్లో కలెక్టర్ సమర్పించనున్నారు. కాన్ఫరెన్స్ ముగిసిన తరువాత ఆయన 12న జిల్లాకు తిరిగి వస్తారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
డిస్ట్రిబ్యూటరీలకు ఆన్ అండ్ఆఫ్ పద్ధతిలో నీరు
కణేకల్లు: హెచ్ఎల్ఎంసీ, జీబీసీ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు విడుదల చేయనున్నట్లు కణేకల్లు హెచ్చెల్సీ సబ్డివిజన్ డీఈఈ దివాకర్రెడ్డి తెలిపారు. స్థానిక హెచ్చెల్సీ కార్యాలయంలో బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హెచ్ ఎల్ఎంసీ, జీబీసీ పరిధిలో 40 వేల ఎకరాల ఆయకట్టులో ఆరుతడి పంటలకు సాగునీరిస్తామన్నారు. ప్రతి రైతు పొలానికీ నీరందించాలనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటరీలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీరు సరఫరా చేస్తామన్నారు.
ఎస్కేయూకు
రూ.10 కోట్ల నిధులు
అనంతపురం సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్కేయూసీఈటీ)కు మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎంఈఆర్ఐటీఈ) ప్రాజెక్ట్ కింద రూ.10 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సాంకేతిక విద్యా బోధన–అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం, సమాన అవకాశాల కల్పన, పరిశోధన, ఆవిష్కరణలు, డిజిటలైజేషన్ ద్వారా సంస్థాగత పాలన బలోపేతం కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రాజెక్ట్ దక్కేందుకు కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందిని వర్సిటీ వీసీ పొఫెసర్ ఎన్.వి.ఆర్. జ్యోతికుమార్ అభినందించారు.
12న లోక్ అదాలత్
అనంతపురం సెంట్రల్: ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్పీ జగదీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు స్టేషన్లు, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీ పడే క్రిమినల్, ట్రాఫిక్ చలాన్లు, సివిల్ కేసులు పరిష్కరించుకోవడానికి ఇదే మంచి అవకాశమని వివరించారు.
జేఎన్టీయూఏ వేదికగా ‘ఇన్నోవేటర్స్ కాన్క్లేవ్’
● అక్టోబర్లో రెండు రోజుల పాటు జాతీయస్థాయి సదస్సు
అనంతపురం: ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, పారిశ్రామికత, పరిశ్రమలు –విద్యాసంస్థల అనుసంధానానికి మరింత బలమైన వేదికను కల్పించే లక్ష్యంతో జేఎన్టీయూఏ వేదికగా జాతీయస్థాయి ‘ఇన్నోవేటర్స్ కాన్క్లేవ్–2026’ నిర్వహించనున్నట్లు వీసీ పొఫెసర్ హెచ్.సుదర్శనరావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘ఆవిష్కరణలు – ప్రభావం చూపే చోటు’ ఇతివృత్తంగా అక్టోబర్ 24, 25 తేదీల్లో జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు, స్టార్టప్లు, పరిశ్రమలు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు చెప్పారు.


