వజ్రకరూరు: కొనకొండ్లలో ఆది చెన్నకేశవ స్వామి రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, పల్లకీసేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మడుగు తేరు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు ఉట్ల ఉత్సవం నిర్వహించారు. పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై కొలువుదీర్చారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి జై ఆది చెన్నకేశవ అంటూ రథాన్ని ముందుకు లాగారు. స్వామివారి రథంపై భక్తులు పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథాన్ని మారెమ్మ కట్ట వరకు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఏటా నిర్వహించే రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో కలిసి మెలసి జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నాగస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమణాయాదవ్, మాజీ సర్పంచు నంచర్ల ఇందిరమ్మ, మాజీ ఎంపీపీ రామచంద్ర, ఆలయ ఈఓ అంగదాల క్రిష్ణయ్య, ఎంపీటీ సీలు పాపన్న, మునయ్య, ముద్దయ్య, సీనియర్ నేత నంచర్ల లాలెప్ప, మాజీ ఉప సర్పంచులు రామక్రిష్ణ, గురు, మాజీ ఎంపీటీసీ శ్రీరాములు, మాజీ సర్పంచు పెద్దరాజు, క్లర్క్ లాలేష్ పాల్గొన్నారు.
నేడు వసంతోత్సవం..
ఆదిచెన్నకేశవ స్వామి రథోత్సవంలో భాగంగా బుధవారం స్వామివారికి అభిషేకం, పల్లకీ సేవ, వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు భూదేవి, లక్ష్మమ్మ దోపులు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఈఓ అంగదాల క్రిష్ణయ్య తెలిపారు.


