అనంతపురం ఎడ్యుకేషన్: ‘గ్రామమే దేశానికి పట్టుగొమ్మ’ అన్న మహాత్మా గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పాలనను గ్రామస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వ సేవ కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. గ్రామంలోనే ప్రజలకు సేవలు అందేలా సచివాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామానికి వచ్చిన ప్రభుత్వ కార్యాలయాల్లా ఇవి పనిచేశాయి. ధ్రువీకరణ పత్రాల నుంచి సంక్షేమ పథకాల దరఖాస్తుల వరకు అనేక సేవలు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి వచ్చాయి.
జిల్లాలో 663 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు కాగా.. 6,532 పోస్టులు మంజూరయ్యాయి. వీటి ద్వారా 545 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 1–బీ అడంగల్, పాస్బుక్కులు, జనన–మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, రేషన్కార్డు సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలనతోపాటు టీటీడీ, ఇతర దేవాలయాల దర్శన టికెట్లు, ఆర్టీసీ, రైల్వే టికెట్ల బుకింగ్ వంటి సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ సేవ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు.. మన ఊరిలోనే పని అనే భావన ప్రజల్లో ఏర్పడింది.
పాలనతోపాటు విద్యారంగంలోనూ నాటి ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి పిల్లలకు మెరుగైన వాతావరణంలో విద్య అందించాలనే లక్ష్యంతో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, ఆర్ఓ ప్లాంట్లు, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఫర్నీచర్, కిచెన్ షెడ్లు, గ్రీన్చాక్ బోర్డులు, ప్రహరీలు, అదనపు తరగతి గదులు, పెయింటింగ్ తదితర పనులు చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొలి విడతలో 1,294 పాఠశాలల్లో రూ.435.97 కోట్లతో పనులు చేపట్టారు. రెండో విడతలో మరో 2,183 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. వీటిలో ఎంపిక చేసిన జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పనులకు సుమారు రూ.322.04 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు కనీస వసతులకు నోచుకోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ‘నాడు– నేడు’తో కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. అయితే చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో విడత పనులకు గ్రహణం పట్టుకుంది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.
ప్రపంచంతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక విద్యను చేరువ చేయాలనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం ట్యాబ్లు, డిజిటల్ కంటెంట్, ఐఎఫ్పీ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బైజూస్ కంటెంట్ను ట్యాబ్లలో నిక్షిప్తం చేసి విద్యార్థులకు అందించారు. అనంతపురం జిల్లాకు సుమారు 26 వేల ట్యాబ్లు చేరగా.. సుమారు రూ.83.20 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇలా వరుసగా రెండేళ్ల పాటు అందజేశారు.
ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు బోధనను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలకు స్మార్ట్ టీవీలు అందించారు. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ బోధన, వీడియో పాఠాలు, సాంకేతిక విద్యా వనరులు అందుబాటులోకి వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ట్యాబ్లు పంపిణీ చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించినా ఇప్పటిదాకా ఒక్కటీ ఇవ్వలేదు.
వివిధ రకాల సేవలను అందించిన సచివాలయాలు చంద్రబాబు పాలనలో నిర్వీర్యంగా మారాయి. శుక్రవారం బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు సచివాలయాన్ని ‘సాక్షి’ పరిశీలించగా.. 11 మందికి గాను డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ మాత్రమే విధుల్లో కనిపించారు. మిగిలిన వారు ‘సర్’ కార్యక్రమానికి వెళ్లినట్టు తెలిపారు. వివిధ సేవల కోసం వచ్చిన ప్రజలు అధికారుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.
సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం
‘నాడు–నేడు’తో బడులకు కొత్త రూపం
డిజిటల్ విద్యతో విద్యార్థులకు
సాంకేతిక వెలుగులు
బడి గదిలోకి డిజిటల్ ప్రపంచం..
రూపురేఖలు మారిన బడులు..
తరగతి గదిలోనే సాంకేతిక బోధన..
663 సచివాలయాలు..


