అనంతపురం ఎడ్యుకేషన్: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలైంది. జిల్లాలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 24 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితా, ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచిన అభ్యర్థుల జాబితా, రోస్టర్ వివరాలు, ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్ను http:// samagrashikshaatp. blogspot. comలో అందుబాటులో ఉంచారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితాపై అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 18వ తేదీలోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ టి.శైలజ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికై న అభ్యర్థులు వెబ్సైట్లో పొందుపరిచిన షెడ్యూల్ ప్రకారం అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు
కళ్యాణదుర్గం: భూమితో సంబంధం లేని వ్యక్తుల పేరిట చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లను కళ్యాణదుర్గం సబ్రిజిస్ట్రార్ రామ్మోహన్ రద్దు చేశారు. ‘ఫేక్ పత్రాలతో భూంఫట్’ శీర్షికన ఈ నెల 14న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లిలో సర్వే నంబర్ 223లో 23.25 ఎకరాల భూ దందాలో పాలుపంచుకున్న అక్రమార్కులను శుక్రవారం కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పిలిపించి రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. ఆ సమయంలో విలేకరులను చూడగానే అక్రమార్కులు ముసుగులు ధరించారు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారంటూ జీఎస్ఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు సబ్ రిజిస్ట్రార్ను నిలదీశారు. వారు సమర్పించిన డాక్యుమెంట్లు, పూర్తి వివరాలు తెలపాలని కోరగా.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ప్రజాసంఘాల నాయకులు తెలిపారు.


