అదనపు సిబ్బందిని
కేటాయించండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించి నాన్ మ్యాపింగ్ ఓట్లకు నోటీసుల జారీ ప్రక్రియను ఐదారు రోజుల్లో పూర్తి చేస్తాం. నియోజకవర్గాల్లో ఏఈఆర్ఓలకు సహకరించేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కేటాయించాలని, లేనిపక్షంలో నెల రోజుల పాటు అదనపు సిబ్బందిని సమకూర్చాలని ఉన్నతాధికారులను కోరాం’’ అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్పై సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు క్లెయిమ్లు, అభ్యంతరాలపై 3,400 దరఖాస్తులు అందాయన్నారు. నాన్ మ్యాపింగ్ ఓట్లకు సంబంధించి నోటీసుల జారీ ప్రక్రియను ఐదారు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో రోజుకు 2,500, మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో రోజుకు వెయ్యి చొప్పున విచారణ లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. ఎన్జీఎస్పీకి సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.
నోటీసుల విచారణ వేగవంతం చేయాలి
అనంతపురం క్రైం: ఎస్ఐఆర్లో భాగంగా జారీ చేసిన నోటీసులపై విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం నగరంలోని నాయక్నగర్ 49వ సచివాలయం పరిధిలో జరుగుతున్న విచారణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. అనంతపురం పరిధిలో ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నందున విచారణ కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా రోజువారీ షెడ్యూల్ ప్రకారం కేటాయించిన సమయానికే ఓటర్లు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు, టౌన్ ప్లానింగ్ అధికారి ఓంకార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


