● జిల్లా విద్యాశాఖ అధికారి ఆయూబ్ హుస్సేన్
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులు తమ అనుభవాలు, సామర్థ్యాల ఆధారంగా విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా వ్యవహరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ సూచించారు. జిల్లా సైన్స్ కేంద్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, ఇన్స్పైర్ మనక్, విద్యార్థి విజ్ఞాన్ మంథన్ తదితర వైజ్ఞానిక పోటీలపై మంగళవారం అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా ప్రణాళిక–2020కు అనుగుణంగా బట్టీ విధానానికి స్వస్తి పలికి, విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులను వైజ్ఞానిక పోటీలకు నమోదు చేసి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు తమను తాము జాతి నిర్మాతలుగా భావించి బోధన చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో గుత్తి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కృష్ణయ్య, జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాలమురళి, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త ఆనందభాస్కర్రెడ్డి, జిల్లా అకడమిక్ సమన్వయకర్త మేడా ప్రసాద్, రిసోర్స్పర్సన్లు శామ్యూల్ ప్రతాప్, శైలజ, వసంతరాణి, సతీష్ పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభం
అనంతపురం: జేఎన్టీయూ (ఏ), జర్మనీ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టినట్లు జేఎన్టీయూ(ఏ) వీసీ ఆచార్య సుదర్శనరావు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఇద్దరు, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఒకరు అడ్మిషన్లు పొందగా.. వీరికి సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ బి.దుర్గాప్రసాద్, అడ్మిషన్ డైరెక్టర్ ఆచార్య సురేష్బాబు మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య నాగప్రసాద్ నాయుడు, ఆచార్య సురేష్బాబు, సునీల్ పాల్గొన్నారు.


