అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్ 8977716661 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ
జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
చదువుతోనే రజకుల
జీవితాల్లో వెలుగులు
అనంతపురం ఎడ్యుకేషన్: చదువుతోనే రజక విద్యార్థుల జీవితాల్లో వెలుగులు సాధ్యమని వక్తలు పేర్కొన్నారు. రజక ఉద్యోగ విద్యావంతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో జిల్లాలోని రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సి.ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 2025–26 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 78 మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి నగదు, మెమొంటో, ప్రశంసాపత్రం అందించి అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడానికి చదువు ఒక్కటే ప్రధాన మార్గమన్నారు. రజక కుటుంబాల్లోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ పరమేష్, కార్పొరేటర్ శ్రీనివాసులు, ఎస్ఐ రమేష్, దేవేంద్రప్ప, సుబ్రమణ్యం, ఆనంద్, వెంకటేష్, శంకర్, రాప్తాడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
హెచ్చెల్సీ ఆధునికీకరణ
పనులపై నిర్లక్ష్యమెందుకు?
ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా నేటికీ జిల్లాకు అత్యంత ముఖ్యమైన తుంగభద్ర హైలెవల్ కెనాల్ ఆధునీకరణ పనులు చేపట్టడకపోవడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని నింబగల్లు సమీపంలో శిథిలావస్థకు చేరుకున్న హెచ్చెల్సీతో పాటు జీబీసీ కాలువలను సీపీఐ నేతల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి విలేకరులతో మాట్లాడారు. హెచ్చెల్సీ, జీబీసీ కాలువల ఆధునీకరణ పనుల్లో జరుగుతున్న జాప్యం రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తోందన్నారు. హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు కర్ణాటకలో పూర్తయినా, ఏపీలో మాత్రం పనులు ఒక్క ఇంచు కూడా ప్రారంభం కాలేదన్నారు. హెచ్చెల్సీని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తే 4 వేల క్యూసెక్కలను సమర్థవంతంగా వినియోగించుకోనే అవకాశం ఉందన్నారు. కాలువ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రెగ్యులేటర్లు, తూములు, ఇతర కీలక నిర్మాణాలు చేపడితే నీటి వృథాను అరికట్టి చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో హెచ్చెల్సీ, జీబీసీలకు పూర్తిస్థాయిలో నీర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు. అనంతరం కేంద్ర, రారష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బొమ్మనహాళ్ మండలంలో జీపు జాత నిర్వహించారు.


