అనంతపురం కల్చరల్: 30 ఏళ్లుగా రామాయణ, మహాభారతాలపై విస్తృత ప్రచారం గావిస్తున్న డాక్టర్ మాడ్గుల ప్రపుల్లకు ప్రతిష్టాత్మక ‘రామాయణి సమ్మాన్’ అవార్డు దక్కింది. ‘రామాయణ రీసెర్చ్ కౌన్సిల్’ వారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఈ నెల 19న గోస్వామి తులసీదాసు జయంతి సందర్భంగా ఆమెకు పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించనున్నారు. నగరానికి చెందిన డాక్టర్ ప్రపుల్ల శ్రీసత్యసాయి విద్యాసంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ గావించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము– రసానుశీలము’ అనే సిద్ధాంత గ్రంథానికి సంబంధించి ఆమెకు డాక్టరేట్ లభించింది. విశ్రాంత జీవితంలో డాక్టర్ మాడ్గుల ప్రపుల్ల ఆధ్యాత్మిక, ధార్మిక ప్రవచనాలు చేస్తూ ధర్మప్రచారం గావిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలలో పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు. దేశంలో 28 మందిని వివిధ విభాగాల్లో రామాయణి సమ్మాన్ అవార్డుకు ఎంపిక చేయగా మన రాష్ట్రం నుంచి ఎంపికై న డాక్టర్ ప్రపుల్లను తెలుగు భాషా వికాస ఉద్యమం ప్రతినిధి డాక్టర్ జగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ్, ప్రవచనకర్త డాక్టర్ పాణ్యం వసుంధర అభినందించారు.


