విడపనకల్లు: మంత్రి పయ్యావుల అనుచరుడి నుంచి కాపాడాలంటూ ఓ మహిళ దీనంగా అర్థిస్తోంది. బుధవారం బాధితురాలు శాంతి తెలిపిన మేరకు.. మండల పరిధిలోని చీకలగురికి గ్రామానికి చెందిన రామచంద్రప్ప తన కుమార్తె శాంతికి 107–1సీ, 108–ఏ సర్వే నంబర్లో 3.30 ఎకరాలను దాన విక్రయం కింద రిజిస్టర్ చేసి ఇవ్వగా.. అదే గ్రామానికి చెందిన టీటీపీ కార్యకర్త యోగేశ్వరరావు ఇందులో ఎకరా భూమిని ఆక్రమించుకున్నాడు. భూమిలోకి బాధితురాలిని వెళ్లనీయకుండా దాడులకు దిగుతున్నాడు. భూమిలోకి వస్తే నిన్ను, నీ భర్తను చంపుతా అంటూ బెదిరిస్తున్నాడు. యోగేశ్వర్కు మంత్రి పయ్యావుల కేశవ్ అండ ఉండడంతో మహిళ అని కూడా చూడకుండా అతని అనుచరుడు కొత్తపల్లి రవి తదితరులతో కలిసి ఇటీవల ఆమైపె దాడి చేయడానికి వెళ్లారు. నానా బూతులు తిట్టారు. దీనిపై పాల్తూరు పోలీసులకు వారం క్రితం ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ బాధితురాలికి న్యాయం చేయకపోగా ఉరవకొండ సీఐని కలవండి అని పంపించివేశాడు. సీఐ మహానందిని కలిసేందుకు అనేక సార్లు కార్యాలయానికి వెళ్లినా ఆయన కూడా ఏ మాత్రమూ పట్టించుకోలేదు. మంత్రికి యోగేశ్వర రావు ప్రధాన అనుచరుడు కావడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రాచమర్యాదలు చేసి పంపుతున్నారని బాధితురాలు వాపోయారు. న్యాయం జరగకపోతే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని బాధిత మహిళ పేర్కొన్నారు.


