అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్శాఖ నిర్దేశించిన ఫీజు వసూళ్లలో అనంతపురం వ్యవసాయ మార్కెట్యార్డు దూకుడు కొనసాగిస్తోంది. రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు మార్కెట్ కమిటీలు డీలా పడ్డాయి. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, 15 సరిహద్దు చెక్పోస్టుల ద్వారా వివిధ రకాల ఫీజులు రూ.14.35 కోట్ల టార్గెట్ ఇచ్చారు. జూలై నెలాఖరుతో ముగిసిన నాలుగు నెలల కాలంలో 30.54 శాతం సగటుతో రూ.4.38 కోట్లు సాధించాయి. ఇందులో అనంతపురం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.5.25 కోట్లు కాగా ఇప్పటికే 43 శాతంతో రూ.2.25 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రూ.1.13 కోట్లకు గానూ 34 శాతంతో రూ.38.15 లక్షల వసూలు చేసి ఉరవకొండ రెండో స్థానంలో కొనసాగుతోంది. శింగనమల, కళ్యాణదుర్గం కమిటీలు 31 శాతం వసూళ్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి. 25 శాతం వసూళ్లతో రాప్తాడు, 21 శాతం వసూళ్లతో తాడిపత్రి ఫరవాలేదనిపించాయి. ఎటుతిరిగి రూ.30 లక్షలకు గానూ కేవలం రూ.3 లక్షల వసూళ్లతో గుత్తి కమిటీ 10 శాతంతో అట్టడుగున ఉండగా, రూ.1.90 కోట్లకు గానూ రూ.26 లక్షలతో రాయదుర్గం మార్కెట్ కమిటీ 14 శాతం, రూ.72 లక్షలకు గానూ రూ.14 లక్షల వసూళ్లతో గుంతకల్లు మార్కెట్ కమిటీ కేవలం 19 శాతంతో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి. సిబ్బంది కొరత, లీకేజీల కారణంగా వసూళ్లు తగ్గినట్లు చెబుతున్నారు. గడువులోపు అన్ని కమిటీల్లోనూ వంద శాతం సాధించడానికి విజిలెన్స్ చర్యలు పటిష్టం చేస్తామని ఏడీ (మార్కెటింగ్) రాఘవేంద్రకుమార్ తెలిపారు.
రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు వెనుకంజ


