కుందుర్పి: మండల కేంద్రంలో ఉన్న జ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. 3 నెలలుగా పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా పాఠశాల విద్యార్థులకు నీటిని సరఫరా చేసేవారు. అయితే ఉన్నఫలంగా గత 15 రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటనలు చేయడం మినహా కనీసం పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇవ్వడంలో విఫలమైయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. పాఠశాలలో నీరు లేకపోవడంతో స్వంత గ్రామాలకు వెళ్లి స్నానాలు చేసి వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. పలుసార్లు తాగునీటి సమస్యపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కుందుర్పిలోని బాలుర గురుకుల పాఠశాలలో నెలకొన్ని మంచినీటి ఎద్దడిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
తీవ్ర ఇబ్బందుల్లో విద్యార్థులు


