● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం అర్బన్: పోలీసు పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్కుమార్, ఏఎస్పీ (అడ్మిన్) నాగభూషణం, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరిస్తారన్నారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలకు సంబంధించి స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా శకటాలను ప్రదర్శించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అవార్డుకు సిఫారసు చేయాలని ప్రభుత్వ శాఖల అధిపతులను ఆదేశించారు. అప్పగించిన బాధ్యతలను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ ప్రేమనాథ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, కిరణ్మయి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
టెట్ పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లావ్యాప్తంగా ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం రెవెన్యూభవన్లో డీఈఓ శ్రీనివాసరావుతో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు కేంద్రాల్లో జరగనున్న టెట్కు 18,191 మంది అభ్యర్థులు, 128 మంది స్కైబ్ర్స్ హాజరవుతారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణకు ఆరుగురు అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మలోల, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, ఆరోగ్యాధికారి వెంకటేశ్వర్లు, డీపీఓ నాగరాజునాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


