రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న నల్లాని శ్రీనివాసులు (60) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతితో మండల పరిషత్ కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరు నెలల క్రితం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీనివాసులకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ పూర్తిస్థాయిలో కోలుకున్నారని, త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారని అందరూ భావించారు. అయితే అనారోగ్యం మళ్లీ తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమించింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీనివాసులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొందారు. సహోద్యోగులు, కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకొని పనిచేసే వ్యక్తిగా పేరొందారు. ఆయన అకాల మరణం సహోద్యోగులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె గ్రామంలో నిర్వహించారు. అనంతపురం రూరల్ ఎంపీడీఓ దివాకర్, కార్యాలయ సిబ్బంది, పలువురు పంచాయతీ కార్యదర్శులు వెళ్లి శ్రీనివాసులు భౌతికకాయానికి నివాళి అర్పించారు.


