అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలపై కక్ష సాధింపు అధికమైందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ ధ్వజమెత్తారు. వైఎస్సారీసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 2023లో వైఎస్సార్సీపీకి చెందిన బీసీ నాయకుడు గోవిందు అల్లుడు జయకుమార్ కొనుగోలు చేసిన 21 ఎకరాల భూమిలో వేసిన బోర్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారన్నారు. ఆ భూమిని ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పలుమార్లు అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు మీసాల రంగన్న మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్గా చేసుకుందన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైందన్నారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి మాట్లాడుతూ జయకుమార్కు చెందిన వ్యవసాయ భూమిలో వేసిన బోర్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే అధికారులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనాల హరికృష్ణ, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాలపాటి శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడికి గోవిందు, జిల్లా కార్యదర్శి మల్లెల జగదీష్, ఉరవకొండ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు జి.సురేష్, మున్సిపల్ విభాగం జిల్లా కార్యదర్శి వడ్డే రామచంద్ర, నాయకులు నిమ్మల నాగరాజు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ తదితరులు పాల్గొన్నారు.


