గుంతకల్లుటౌన్: రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక విధానాలను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించిన 15,049 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమంగా కేసులు బనాయించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. కొందరిపై దేశద్రోహం కేసులు పెట్టడమేంటని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గాడితప్పి శాంతిభద్రతలను గాలికొదిలేసిందని ఆయన నిప్పులు చెరిగారు. రాప్తాడు వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ను పోలీసులు చిత్రహింసలు పెట్టి వేధించడాన్ని ఆయన తప్పుబట్టారు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో 6.5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయన్నారు. అన్నదాతలకు పంటనష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 5న జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం చంద్రబాబును కలిసి హంద్రీ–నీవా కెనాల్ ద్వారా పంటపొలాలకు నీరివ్వాలని కోరతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఆగస్టు 1 నుంచి 6 వరకు అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో ప్రచారం, 6 నుంచి 15 వరకు జిల్లాలో జీపుజాతా, 17న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు ఎండీ.గౌస్, రాము, నాయకులు వీరభద్రస్వామి, మహేష్, ఈశ్వరయ్య, రామాంజినేయులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్


