● రోజురోజుకూ అంకెలు మార్చి చూపడంపై సర్వత్రా విమర్శలు
అనంతపురం అర్బన్: ఆరోగ్యవంతమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో ఏం జరుగుతోందో అంతు పట్టకుండా ఉంది. ఇదిగో వందశాతం పూర్తయ్యిందంటూ ఒకవైపు చెబుతూనే... మరోవైపు రోజురోజుకూ అంకెలు మారుస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ జరిగాయంటూ ఒకసారి ప్రకటించిన సంఖ్యలో మరుసటి రోజుకు తగ్గడం... అదే క్రమంలో వెనక్కిరాని (అన్కలెక్టబుల్) ఈఎఫ్ల సంఖ్య పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
తగ్గుతున్న డిజిటలైజేషన్ ఈఎఫ్లు
ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేసిన తరువాత అప్పటి వరకు జరిగిన సంఖ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. కానీ, జిల్లా ‘సర్’ అధికారులు మాత్రం అది సాధ్యమేనని అంకెలతో సహా చూపిస్తున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సర్ నివేదికలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 14 తేదీ వరకు డిజిటలైజేషన్ అయిన ఈఎఫ్ల సంఖ్య 18,29,706గా ప్రకటించారు. ఇక 18వ తేదీనాటికి డిజిటలైజేషన్ చేసిన ఈఎఎఫ్లు 18,23,293గా నివేదికలో స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో డిజిటలైజేషన్ ఈఎఫ్ల సంఖ్య 6,413 తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి డిజిటలైజేషన్ చేసిన తరువాత ఆ సంఖ్య ఎలా తగ్గింది అనేది అధికారులకే తెలియాలి.
● మరోవైపు అన్కలెక్టబుల్ (వెనక్కి తీసుకోని) ఈఎఫ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 14వ తేదీన ప్రకటించిన నివేదిక ప్రకారం అన్కలెక్టబుల్ ఈఎఫ్లు 2,08,791 ఉన్నాయి. 18వ తేదీన ప్రకటించిన నివేదిక ప్రకారం అన్కలెక్టబుల్ ఈఎఫ్లు 2,15,230 ఉండడం గమనార్హం. ఇక్కడ 14వ తేదీ నుంచి 18వ తేదీ నాటికి 6,439 పెరిగాయి. ఎలా పెరిగాయనేది కూడా అఽధికారులకే తెలియాలి. ఈ విషయంపై కలెక్టర్ ఓ.ఆనంద్ స్పందించారు. ఎన్యుమరేషన్ ఫారం ఒకసారి డిజిటలైజేషన్ చేసిన తరువాత మార్పు చేయవచ్చా లేదా అనేది పరిశీలిస్తానన్నారు. అదే విధంగా అన్కలెక్టబుల్ ఈఎఫ్ల అంశాన్ని కూడా చూస్తానని చెప్పారు.


