‘ప్రాణహాని ఉందని స్టేషన్కు వెళ్తే ఎస్ఐ దుర్భాషలాడారు’
సాక్షి టాస్క్ఫోర్స్: తమకు ప్రాణహాని ఉందని పోలీసు స్టేషన్కు వెళ్తే ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ దుర్భాషలాడి కొట్టారంటూ కంబదూరు మండలం చెన్నంపల్లికి చెందిన వెట్టి శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం అనంతపురంలోని జిల్లా పోలీసు కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. చెన్నంపల్లికి చెందిన రోడ్డు గణేష్, రోహిత్, పి.ఆంజనేయులు,ఎం.వన్నూరుస్వామి, బొమ్మశంకర్ లు కొంతకాలంగా శ్యామల కుటుంబసభ్యులపై మారణాయుధాలతో దాడికి యత్నిస్తున్నారు. ప్రాణ రక్షణ కల్పించాలంటూ బాధితులు కంబదూరు ఎస్ఐ లోకేష్ చుట్టూ తిరిగినా కనికరం చూపలేదు. ఈ నెల 15న రాత్రి మళ్లీ పి.ఆంజనేయులు కత్తితో శ్యామల కుటుంబీకులపై దాడి చేసేందుకు యత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న బాధితులు వెంటనే కంబదూరు పోలీసుస్టేషన్కు వెళ్లగా.. కానిస్టేబుల్ రాజు నాయక్ వారిపై రెచ్చిపోయాడు. నానా దుర్భాషలాడాడు. బాధితులు స్టేషన్ బయట కూర్చుని ఉండగా అక్కడికి వచ్చిన ఎస్ఐ లోకేష్ మహిళలని కూడా చూడకుండా బూతులు తిట్టారు. శ్యామల సోదరుడిని బూటు కాలితో తన్నారు. శ్యామల తల్లి ఎట్టి నాగమ్మను పోలీసులు బలవంతంగా లాగడంతో ఆమె గాయపడింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన శ్యామల గురువారం తన కుటుంబసభ్యులతో కలిసి అనంతపురంలో ఎస్పీ జగదీష్ను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించింది. స్పందించిన ఎస్పీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు శ్యామల తెలిపింది. శ్యామల కుటుంబీకులకు న్యాయం చేయకపోతే సోమవారం కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయం ఎదుట ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు తెలిసింది.


