కూడేరు/బెళుగుప్ప: సీఎం చంద్రబాబు కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల కడుపు కొట్టి హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్తో లైనింగ్ చేపట్టి నీటిని కుప్పానికి తీసుకెళ్లడంలో ఉన్న లో‘గుట్టు’ను బహిర్గతం చేస్తామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విఽశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఆయన కూడేరులో వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమయ్యారు. అలాగే బెళుగుప్ప మండల పరిధిలోని బూదిగుమ్మ రామసాగరంలో పార్టీ మండల కన్వీనర్ చిన్న మచ్చన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ తదితరులతో సమావేశమయ్యారు. విశ్వ మాట్లాడుతూ ఈ నెల 19న ఉదయం 9:30 గంటలకు కూడేరు మండలం చోళసముద్రం వద్ద ఉన్న హంద్రీ నీవా కాలువ బ్రిడ్జ్ నుంచి కరుట్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జ్ వరకు రాయలసీమ ప్రాజెక్టులె టాస్క్ఫోర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రకు ఆ కమిటీ రాష్ట్ర నేతలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీఓని చంద్రబాబు రద్దు చేసి , హంద్రీ నీవా కాలువ వెడల్పు చేయకుండా కాంక్రీట్తో లైనింగ్ పనులకు ఎక్కువ మొత్తంతో టెండర్లను ఆహ్వానించి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా కాలువకు లైనింగ్ చేపట్టడం ద్వారా కరువు ప్రాంత రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. రూ. వేల కోట్లతో కేవలం 100 రోజుల్లో లైనింగ్ పని చేపట్టి కుప్పానికి నీరు తీసుకెళ్లారన్నారు. దీంతో పనుల్లో నాణ్యత లోపించిందన్నారు. చంద్రబాబు కుతంత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూడేరు. బెళుగుప్ప, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి రమణ, ఎంపీపీ నారాయణరెడ్డి, మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, మండల పరిశీలకులు త్రిలోక్ రెడ్డి, నేతలు రామ్మోహన్, గంగాధర్, రంగారెడ్డి, ధనుంజయ్య, విజయ భాస్కర్రెడ్డి, శిద్దారెడ్డి, అక్కులన్న, దేవేంద్ర, అశోక్, హరినాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
19న కూడేరు మండలంలో హంద్రీనీవా కాలువపై పాదయాత్ర
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి


