అనంతపురం అగ్రికల్చర్: పంటల బీమా పథకాలకు ప్రీమియం చెల్లింపు గడువును నెలాఖరు వరకు పొడిగించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. రైతులే స్వచ్ఛందంగా ప్రీమియం కట్టి బీమా పథకాలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 15వ తేదీ మధ్య బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులు ఆటోమేటిక్గా బీమా పరిధిలోకి వస్తారని, ఈ–క్రాప్లో నమోదు చేసిన పంటకు మాత్రమే రుణం పొంది ఉండాలన్నారు. బ్యాంకును సంప్రదించి పంట పేరు మార్పు చేసుకోవాలన్నారు.ఫసల్బీమా కింద కంది,ఆముదం, జొన్న, మొక్కజొన్న, ఎండుమిరప రైతులు ఈనెల 31లోపు, వరి రైతులు ఆగస్టు 15లోపు ప్రీమియం చెల్లించాలన్నారు. ప్రీమియం గడువుకు రెండు రోజుల ముందుగా బ్యాంకుల్లో పంట మార్పిడి లేదా బీమా వద్దనుకుంటే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలన్నారు.
యాడికి తహసీల్దార్ ‘పచ్చ’ భక్తి
తాడిపత్రిటౌన్: యాడికి తహసీల్దార్ ప్రతాప్రెడ్డి చూపిన ‘పచ్చ’ భక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం తన కార్యాలయంలోనే అధికార టీడీపీకి చెందిన బీఎల్ఏలను సన్మానించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎంతో శ్రమకు ఓర్చుకుని ‘ఎస్ఆర్ఐ’ ప్రక్రియను పూర్తి చేసిన తమను పట్టించుకోకుండా ఓ పార్టీకి చెందిన బీఎల్ఏలను సన్మానించడంపై బీఎల్ఓలు అసం తృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రతాప్రెడ్డిని వివరణ కోరగా ఆయన స్పందించారు. వీఆర్ఓలు శాలువలు, పూలమాలలు సిద్ధం చేయడంతో సన్మానించానని చెప్పడం గమనార్హం.


