● ధ్రువీకరించకపోవడంపై కుటుంబ సభ్యుల ఆందోళన
రాప్తాడు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పటాస్ శ్రీకాంత్ (అలియాస్ కురుబ చిట్ర శ్రీకాంత్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ప్రత్యేక పోలీసు బృందం బెంగ ళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు శ్రీకాంత్ అరెస్టును పోలీసులు అధికారికంగా ధ్రువీకరించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీకాంత్ స్పందిస్తూ, ఎంఎస్ రాజు అవినీతి, అక్రమాలకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయనను ఎక్కడ ఉంచారు, ఏ పోలీసు స్టేషన్లో ఉన్నారు, ఎప్పుడు కోర్టులో హాజరుపరుస్తారనే విషయాలపై అధికారిక సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం చేయకుండా కోర్టులో హాజరుపరచాలని, లేనిపక్షంలో చట్టపరంగా న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.


