రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ సిండికేట్ నగర్లో 92 ఏళ్ల వృద్ధురాలి బంగారు గొలుసు అనుమానాస్పదంగా మాయమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. సిండికేట్ నగర్కు చెందిన రామక్క (92) తన కుమారుల వద్ద నివసిస్తోంది. వృద్ధాప్యం కారణంగా ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన గదిలో ఉంటోంది. ఆమె మెడలో సుమారు ఒకటిన్నర తులాల బంగారు చైన్ ఉండేది. రోజూ స్నానం చేసేందుకు వెళ్లే ముందు చైన్ను బాత్రూం బయట ఉన్న కొక్కీకి తగిలించి, స్నానం ముగించుకుని వచ్చాక తిరిగి మెడలో వేసుకునే అలవాటు ఉంది. సోమవారం కూడా అలానే చైన్ను కొక్కీకి తగిలించి స్నానానికి వెళ్లింది. స్నానం చేసిన తర్వాత ఆరు బయట ఉంది. ఈలోపు ఓ వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చి, ‘పెద్దమ్మా... చైన్ ఇక్కడే తగిలించావు‘ అని చెప్పగా, ‘తీసుకుంటాలే నాయనా‘ అని ఆమె సమాధానమిచ్చింది. అనంతరం వారిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు పిల్లలు కాంపౌండ్లోకి రావడంతో వారిని మందలించి పంపించారు. ఆ తర్వాత వృద్ధురాలు బయటకు వచ్చి చూడగా కొక్కీకి తగిలించిన చైన్ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె విషయాన్ని కుమారులు, మనవళ్లకు తెలియజేసింది. బాధిత కుటుంబ సభ్యులు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


