బొమ్మనహాళ్: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన వెంకటేశులు, శ్రీదేవి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో బేకరీ నిర్వహిసూత కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమారుడు తిరుమల (21) కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న ఇండో–అమెరికన్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో వదిలేసి ఖాళీగా ఉంటున్నాడు. బుద్ధిగా చదువుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు సూచించినా తిరుమలలో మార్పు రాలేదు. ఇదే విషయంగా సోమవారం రాత్రి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మందలించారు. దీంతో గదిలోకి తలుపు వేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఎంత సేపటికీ తలుపులు తీయకపోవడంతో బద్ధలుగొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న తిరుమలను గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


