అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్– అన్నదాత సుఖీభవ కింద ఈ ఏడాదికి సంబంధించి చివరి (మూడో) విడతగా శుక్రవారం రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ కానుందని వ్యవసాయశాఖ జేడీ రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 2న మొదటి విడతగా రూ.7 వేలు, రెండో విడతగా నవంబర్లో రూ.7 వేలు ప్రకారం జమ చేశారు. ఇప్పుడు మూడో విడత కింద కేంద్రం నుంచి రూ.2 వేలు, రాష్ట్రం వాటా కింద రూ.4 వేల ప్రకారం మొత్తం రూ.6వేలు జమ చేస్తారన్నారు. జిల్లాకు సంబంధించి సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.110.26 కోట్లు, పీఎం కిసాన్ కింద 2.58 లక్షల మంది రైతులకు రూ.53.01 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గానికి రూ.28.32 కోట్లు, రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాలకు రూ.13.46 కోట్లు, శింగనమలకు రూ.31.52 కోట్లు, గుంతకల్లుకు రూ.16.31 కోట్లు, కళ్యాణదుర్గానికి రూ.30.27 కోట్లు, రాయదుర్గానికి రూ.25.01 కోట్లు, తాడిపత్రికి రూ.18.16 కోట్లు, అనంతపురం అర్బన్ పరిధిలో రైతులకు రూ.21 లక్షలు మేర నిధులు విడుదల అవుతున్నట్లు తెలిపారు.
కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు బుధవారం రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.
దివ్యాంగ విద్యార్థులకు ‘స్క్రైబ్’ కష్టాలు
అనంతపురం ఎడ్యుకేషన్: కొందరు హెచ్ఎంల నిర్లక్ష్యం కారణంగా దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్ కష్టాలు వచ్చి పడ్డాయి. నిబంధనల ప్రకారం స్క్రైబ్ కోసం దరఖాస్తు ప్రక్రియను పాఠశాల హెడ్మాస్టర్ ద్వారా పూర్తి చేస్తే సరిపోతుంది. అయితే ఈ నిబంధనను కొందరు హెచ్ఎంలు విస్మరించి, విద్యార్థులను నేరుగా డీఈఓ కార్యాలయానికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్ఎంల సూచనతో పుట్లూరు విద్యార్థులు వరుణ్, దీక్షిత, పుట్లూరు మండలం కొండేపల్లి విద్యార్థి సంధాని బుధవారం డీఈఓ కార్యాలయానికి తల్లిదండ్రులతో కలసి వచ్చాకు. వైకల్యంతో బాధపడుతున్న వారు ఎండల్లో అష్ట కష్టాలు పడి డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. వారి ప్రాంతాల నుంచి నేరుగా బస్సులు లేకపోవడంతో పిల్లలను పిలుచుకుని తల్లిదండ్రులు పుట్లూరు నుంచి తాడిపత్రికి ఆటోలో వచ్చి అక్కడి నుంచి అనంతపురానికి బస్సులో ప్రయాణించారు. పాఠశాల స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యను హెడ్మాస్టర్ల నిర్లక్ష్యం కారణంగా పెద్ద సమస్యగా మారింది. ‘పిల్లాడు సరిగ్గా నడవలేడు పరీక్ష రాయడానికి స్క్రైబ్ కావాలి. హెచ్ఎంలు చేయాల్సిన పనికి మమ్మల్ని జిల్లా కార్యాలయానికి పంపించారు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.


