
గడువులోపు పరిష్కారం చూపాలి
గుంతకల్లు: రెవెన్యూ పరమైన అంశాల్లో అర్జీదారులు ఇచ్చిన వినతులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ ఆదేశించారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై స్థానిక శ్రీశంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఆర్ఓ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. భూతగాదాలు,రస్తా సమస్యలు,ఇంటి స్థలాలు... తదితర సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయంటూ అధికారులతో ఆరా తీశారు. రెవెన్యూ పరమైన భూసేకరణ, ఆర్ఓఆర్ సమస్యలు తదితర విషయాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జున, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, సర్వే ఏడీ రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు.
నక్కనదొడ్డి తండాలో పర్యటించిన కలెక్టర్
గుంతకల్లు రూరల్: ఆర్ఓ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం గుంతకల్లుకు వచ్చిన కలెక్టర్ వినోద్కుమార్... అనంతరం ఇదే మండలంలోని నక్కనదొడ్డి తండాలో పర్యటించారు. గ్రామానికి చెందిన రైతు మునే నాయక్ సర్వే నంబర్ 342లో ఉన్న తన భూమిని రీ సర్వే చేయడంతోపాటు, సబ్ డివిజన్ కూడా చేయాలని కోరుతూ ఇటీవల కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చాడు. ఈ క్రమంలో నక్కనదొడ్డి తండాకు చేరుకున్న కలెక్టర్... క్షేత్రస్థాయిలో సర్వే నంబర్ 342లోని భూములను పరిశీలించారు. మునేనాయక్కు చెందిన భూమి వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు ఇచ్చిన అర్జీ మేరకు సదరు భూమిని వెంటనే సబ్ డివిజన్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ రమాదేవి, ఇతర సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్
నక్కనదొడ్డి తండాలో పర్యటన