సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం.. ఆర్టీసీ కాంప్లెక్స్ దిగ్బంధం రెండు రోజుల నిరసనకు స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపాటు.. డిమాండ్ల పరిష్కారానికి డిమాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన జంక్షన్లో రాస్తారోకో నినాదాలతో హోరెత్తిన ప్రాంతం.. స్తంభించిన ట్రాఫిక్ సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తత.. రాత్రి 9 గంటల వరకు నిరసన
వైఎస్సార్సీపీ సంఘీభావం
ఇద్దరు ఉద్యోగులకు అస్వస్థత
సచివాలయ ఉద్యోగుల నిరసనలో ఇద్దరు ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోవడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగుతుండగా, మధ్యాహ్నం రోడ్డుపై నిరసన సందర్భంగా నీరసంతో వారు కుప్పకూలిపోయారు. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించి ఒకరిని 108 అంబులెన్స్లో, మరొకరిని ఆటోలో కేజీహెచ్కు తరలించారు.
వేధింపులు ఆపాలి
తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. వివాదాస్పద జీవో నం.11ను వెంటనే రద్దు చేయాలని, డిప్యూటేషన్ల పేరుతో వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు కల్పించాలని, పని వేళలు ముగిసిన తర్వాత కూడా వాట్సప్ సందేశాల ద్వారా అధికారులు ఒత్తిడి చేయడం నిలిపివేయాలని కోరారు. నెలలుగా పేరుకుపోయిన సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే రోడ్డెక్కాల్సి వచ్చిందని తెలిపారు.ప్రభుత్వం వెంటనే చర్చలకు ఆహ్వానించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు.
సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, మెరిట్ ఆధారంగా 1.34 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారన్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు.


