నర్సీపట్నం: పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు ఉన్నాయి. యలమంచిలిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. అభ్యంతరాలు లేకపోవడంతో ఈ పురపాలికలో 25 వార్డులు ఉండగా 32 వార్డులకు పెంచుతూ తుది ప్రచురణ చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న 28 వార్డులను 40 వార్డులకు పెంపుదల చేశారు. దీనిపై పలువురు శాసీ్త్రయంగా నిర్వహించలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డుల విభజనపై వచ్చిన వ్యాజ్యాలను ఇటీవల కోర్టు కొట్టేసింది. దీంతో వార్డుల విభజనపై అభ్యంతరాలు తొలగడంతో, మున్సిపల్ అధికారులు ఈ నెల 5వ తేదీన 28 వార్డుల నుంచి 40 వార్డులకు పెంచుతూ ముసాయిదాను విడుదల చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వార్డుల పునర్విభజన జరిగింది. ఒక్కో వార్డు నుంచి 1,200 నుంచి 1,250 మంది ఓటర్లు ఉండే విధంగా పట్టణ ప్రణాళిక విభాగం ఈ ప్రక్రియ నిర్వహించింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో 47,821 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 56 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పెరిగిన వార్డుల రిత్యా పోలింగ్ కేంద్రాలు పెరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంతో పాటు వార్డుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యారు.
అన్ని వసతులు ఉండేలా..
ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్తు సదుపాయం, మౌలిక వసతులు ఉండేలా చూస్తున్నారు. వర్షం కురిసినా నీరు చేరకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలు, సచివాలయాలను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నారు.


