నాతవరం: చెరువు గర్భానికి సంబంధించి డీపట్టా మంజూరు చేయడంపై వి.బి.అగ్రహారం గ్రామస్తులు ఆగ్రహించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వి.బి.అగ్రహారంలో సర్వే నంబరు 21లో నాలుగెకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో 70 సెంట్లు మినహాయించి మిగతా భూమికి రెవెన్యూ అధికారులు ఓ వ్యక్తికి డీ ఫారం పట్టా ఇచ్చారు. ప్రస్తుతం చెరువు గర్భంలో వ్యవసాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. సదరు వ్యక్తి డీపట్టా చూపించి ఎదురు దాడికి దిగాడు. రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి చెరువు గర్భంలో పట్టా ఇవ్వడంపై ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో రైతులతోపాటు మహిళలు సైతం శుక్రవారం నాతవరం తహసీల్దారు చందనరేఖకు ఫిర్యాదు చేశారు. డీపట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెరువు ఆయకట్టు కింద ఏటా ఖరీఫ్ సీజన్లో 150 ఎకరాల్లో వరినాట్లు వేసేవారమని, 1974లో తాండవ రిజర్వాయరు ఏర్పాటుతో చెరువుపై ఆధారపడటం తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో చెరువుపై కన్నేసి ఆక్రమణకు యత్నిస్తున్నారని ఆగ్రహించారు. దీనిపై తహసీల్దారు చందనరేఖ మాట్లాడుతూ డీపట్టా రద్దు చేసేందుకు కలెక్టరుకు నివేదిస్తానన్నారు.
తహసీల్దారుకు వి.బి.అగ్రహారం గ్రామస్తుల ఫిర్యాదు


