● పురుషోత్తపురం వద్ద బైక్ను ఢీకొట్టిన ట్రాలీ
● ప్లంబర్ దుర్మారణం● మరో యువకుడికి గాయాలు
యలమంచిలి రూరల్: పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్న యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరో యువకుడు గాయపడ్డాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర అందించిన వివరాలివి..విశాఖ జిల్లా భీమునిపట్నానికి చెందిన రవ్వ సంతోష్(26),రవ్వ దుర్గారావు(31),చింతల సాయి(27)లు ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటూ ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం విజయవాడ నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై భీమునిపట్నం బయలుదేరారు. మార్గమధ్యంలో అన్నవరంలో ప్లంబింగ్ పని పూర్తి చేసుకుని భీమిలి వెళ్తుండగా యలమంచిలి మండలం పురుషోత్తపురం చేరుకునేసరికి చింతల సాయి నడుతున్న స్కూటీని వెనుక వస్తున్న ట్రాలీ ఢీకొట్టింది. స్కూటీ వెనుక కూర్చున్న రవ్వ సంతోష్, నడుతున్న చింతల సాయి గాయపడ్డారు. వీరిద్దర్నీ హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం తగలడంతో రవ్వ సంతోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చింతల సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద స్థలంలో గాయపడిన స్నేహితులిద్దర్నీ చూసిన మరో యువకుడు రవ్వ దుర్గారావు తీవ్రంగా రోదించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.


