తుమ్మపాల: విపత్తు సమయంలో బాధిత ప్రజలకు సహాయం చేయడంలో జిల్లా యాంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని, అసోం రాష్ట్రంలో వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆపన్నహస్తం అందించాలనే ఉద్దేశంతో నిధులు సేకరించి పంపించననున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇతరుల సహకారంతో రూ.26,74,296 నిధులను సేకరించినట్టు తెలిపారు. అసోం వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అసోం వరద సహాయ నిధి కోసం జిల్లా నుంచి రూ.10 లక్షల నిధులు సేకరించాలని ప్రారంభ లక్ష్యంగా నిర్ణయించామని, అయితే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇతరుల సమష్టి కృషి, ఉదారత నిర్దేశించిన లక్ష్యానికి రూ.రెండున్నర రెట్లకు పైగా నిధులను సేకరించగలిగామన్నారు. సేకరించిన మొత్తాన్ని పారదర్శకంగా, నేరుగా అసోం వరద బాధితులకు సహాయపడే విధంగా సంబంధిత అధికారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అసోంలోని సంబంధిత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు నేరుగా బదిలీ చేసేందుకు చెక్కును అందజేస్తున్నట్టు తెలిపారు. అసోం వరద సహాయ నిధికి సంబంధించిన చెక్కు అందజేసే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ) రామారావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


